16, జులై 2013, మంగళవారం

తెలుగు పద్యం‌ అంటే జనం ఎందుకు పారిపోతున్నారు? - 2

ఈ శీర్షికలో మొదటి భాగానికి మంచి స్పందన వచ్చింది.  ఆసక్తి చూపిన అందరు చదువరులకు నా ధన్య వాదాలు.
దీనిని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తున్నది.  తెలుగు పాఠకులకు పద్యం అంటే తమ సాంస్కృతికి వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం అన్న అవగాహన బాగానే ఉన్నది.  కాని కొంత మంది చదువరులకు ఆసక్తి ఉన్నా స్వయంగా పద్యాలను చదివి ఆనందించలేని పరిస్థితి.  మరి కొంత మందికి తెలుగుభాష యొక్క పదసంపదతోనూ వ్యాకరణస్వరూపంతోనూ‌ పరిచయం చాలా పరిమితం కావటం కారణంగా చదవటానికి ప్రయత్నించినా అర్థంకాక మనవల్ల కాదులే‌ అని విరమించుకున్న పరిస్థితి.  అనేకమందికి పద్యం పట్ల చులకన భావం‌ కలిగించిన సమకాలీన కవిత్వ వాతావరణం‌ కారణంగా పద్యం చచ్చిపోయింది దాని గోల మనకెందుకూ‌ అనే ఉదాసీనత.  లేదా నేటి కాలానికి పద్యం‌ పనికిరాదనే చులకన భావం.  ఇలాంటి కారణాలవల్ల పద్యం మసకేసి పోతోంది. అయితే ఎవరి కారణాలు వాళ్ళకున్నా, అసలు పద్యాన్ని చూసి జనబాహుళ్యం ఎందుకు దూరంగా పోతున్నదీ‌ తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం కనిపించింది.  వ్యాసకర్తకు అది చాలా సంతోషం కలిగిస్తోంది.

ముందు భాగంలో చెప్పుకున్నట్లుగా ఈ విషయంలో చర్చనీయాంశాలు ఇంకా చాలానే ఉన్నాయి.  అందుచేత చర్చ కొనసాగిద్దాం.

ఒకప్పుడు బమ్మెర పోతనామాత్యులవారి శ్రీమదాంద్ర మహాభాగవతం పుస్తకం లేని తెలుగు వారి యిల్లు ఉండేది కాదన్నట్లుగా కనబడేది.  పూర్తి భాగవతగ్రంథం కాకపోయినా కనీసం‌ దశమస్కంధం అయినా తప్పక ప్రతి యింట్లో ఉండేది అంటే అతిశయోక్తి కాదు.  గత నలభై సంవత్సరాలుగా పరిస్థితి యెంత వేగంగా మారి పోయిందీ అంటే ఈ‌రోజున పోతన గారి భాగవతం‌గ్రంధం దాదాపు ఎవరి ఇంట్లోనూ‌ కనిపించటం లేదు.  అసలు పోతనగారి పేరు తెలిసిన తెలుగువారి సంఖ్య కూడా స్వల్పం‌ అయిపోయింది. 

ఈ వ్యాసం మొదటి భాగానికి  కష్టే ఫలే  శర్మగారు "పోతనగారి పద్యాలంటే ద్రాక్షాపాకం"  అన్నారు.  ఈ‌ మాటలో‌ ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.  కవిత్వం అర్థమయే తీరును బట్టి మన వాళ్ళు కవిత్వాన్ని మూడు రకాలుగా చమత్కరించారు.  అవి:

౧.  ద్రాక్షాపాకం:   ద్రాక్షపండు తినటానికి ఏ మాత్రమూ‌ కష్టం‌ ఉండదు కదా?  ఊరకే అలా నోట్లో వేసుకుంటే చాలు.
౨.  కదళీపాకం:   అరటిపండు తినటానికి తొక్క తీయటం అనే స్వల్పమైన శ్రమ చాలు. అసలు అదీ‌ ఒక శ్రమ అనుకుంటామా?
౩. నారికేళపాకం: కొబ్బరిముక్కలు రుచి చూడాలంటే? అబ్బో‌ ఎంత పెద్ద తతంగం. కొబ్బరి బోండాం ఒలవాలి. అది ఆషామాషీ వ్యవహారం కాదు. చాకుతోనో‌ కత్తిపీటతోనో‌ అయ్యే పని కాదు. బోడాం ఒలిచి ఇవ్వటానికి నేర్పరులు ఉంటారు. వాళ్ళే చేస్తారు. మనం‌ అలా బోండాం లోపలి కొబ్బరి కాయని తెచ్చుకుని వాడుకుంటాం.  అంతే.  అంతేనా? కొబ్బరి ముక్కలు చేతిలోకి వచ్చాయా? రాలేదు కదా? మళ్ళా ఆ కొబ్బరి కాయని జాగ్రత్తగా పగుల కొట్టాలి.  వేళ్ళు జాగ్రత్త సుమా! నీళ్ళు జాగ్రత్తగా పెద్ద గ్లాసులోకి పట్టుకోండి - బాగుంటాయి. ఇంకా పనుంది. కొబ్బరి చెక్కలలోంచి కొబ్బరి ముక్కలుగా తీయాలంటే అలవాటు లేకపోతే చాకు చేతిలో‌ దిగే ప్రమాదం ఉంది. సరే, సరే, అంతా సవ్యంగా జరిగింది. ఇప్పుదు కొబ్బరి ముక్కలు ఆరగించి ఆనందించవచ్చును.  చూసారా కొబ్బరి తినాలంటే ఎంత తతంగం ఉందో?  మీకు తెలుసు కదా.  

అలాగే ద్రాక్షాపాకంలో ఉన్న పద్యం చదివీ చదవగానే హాయిగా అర్థం అవుతుంది. కదళీపాకంలో ఉన్నదయితే కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవటం అవసరం.  ఇక పద్యం నారికేళపాకంలో ఉందంటే మాత్రం పద్యంతో‌ బాగా కుస్తీ పడితే గాని దాని అర్థం ఏమిటో‌ చచ్చినా బోధ పడదన్న మాట.

శర్మగారు పోతనగారి పద్యాలు ద్రాక్షాపాకంలో‌ ఉంటాయీ‌ అన్నది నిజమే.  కాని ద్రాక్షాపాక కవిత్వంగా పేరున్న పోతన పద్యాలు అర్థం చేసుకుందుకు నేటి తరానికి గగనంగా ఉంది నేడు.  పోతనగారి పద్యాలు సులభంగా అన్వయం చేసుకోవచ్చును - అంటే పదాలు సహజక్రమంలో ఉంటాయి. అర్థం కఠినమైన చమత్కారాల వెనుక దాక్కుని ఉండదు. అంత వరకూ బాగానే ఉంది.  కాని ఒకనాడు సులభంగా అనిపించిన పోతనగారు వాడిన పదసంపద నేడు జనానికి అందుబాటులో లేదు.  అంటే ఆ సంపద ఎక్కడికీ పోలేదు.  మనమే తరాలు గడచిన కొద్దీ‌ ఆధునికత పేరుతో ఆ సంపదకు దూరంగా జరిగి పోయాం‌ అన్న మాట.  ఉదాహరణలుగా కొన్ని పోతనగారి ప్రసిధ్ధమైన పద్యాలు కొన్ని చూద్దాం:

సీ. మందార మకరంద మాధుర్యమున దేలు 
     మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు
     రాయంచ చనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
     కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
     మరుగునే సాంద్ర నీహారములకు

తే. అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల


ప్రహ్లాదుడు అంటే తెలుసు కదా. ఆ పిల్లవాడు తండ్రి హిరణ్యకశిపుడితో అన్న మాటగా పోతనగారి పద్యం ఇది
చదవటానికి ఎంత హాయిగా ఉంది?  మరొకటి

ఉ. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీలమై
ఎవ్వని యందు డిందుఁ బరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వాఁ
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్


ఇది మొసలి నోటికి చిక్కిన గజరాజు చెప్పిన పద్యం. అదే కథలోని మరొకటి

శా. లా వొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవె తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావె ఈశ్వర కావవె వరద సంరక్షింపు భద్రాత్మకా

ఈ పద్యాలు చాలు.  ఒకప్పుడు అందరి తెలుగువాళ్ళ నోళ్ళలోనూ నానుతూ అమందానందాన్ని పంచిన పద్యాలివి.
అయితే ఇప్పుడు ఈ‌ పద్యాలు పాడే తల్లిదండ్రులూ, విని ఆనందించి నేర్చుకునే పిల్లలూ ఉన్న లోగిళ్ళు రూపుమాసిపోయాయి.  ఆ మాట తలచుకుంటేనే చాల బాధ కలుగుతుంది!

ఎందుకు ఇంత ద్రాక్షాపాకంలో ఉంటున్న పద్యాలూ జనానికి దూరం అయిపోయాయీ అంటే వాటిలో ఎంత అందమైన ధార ఉన్నా పద్యాలలో వాడిన పదాలు మనకు అపరిచితం అయిపోవటమే!

మందారమకరంద పద్యంలో తేలు, పోవునే, తూగు, చను, కోయిల, చొక్కు, చేరు, అరుగు, ఏ రీతి, చేరు, నేర్చు, మాటలు, వేయి, ఏల అన్న పదాలు మినహాయిస్తే‌ అంతా సంస్కృతమే. అచ్చం తెలుగు ఛందస్సు అయిన సీసం నిండా సంస్కృతం.  అలాగే అచ్చం తెలుగు ఛందస్సు అయిన తేటగీతిలో కూడా బోలెడంత సంస్కృతం - అసలు రెండు పాదాల చిల్లర ఒకటే సంస్కృత సమాసం.  కాస్త సంస్కృత పరిచయం ఉన్న తెలుగు చదువరులు కూడా మదనము, కుటజము,  నీహారము రసాలము వంటి కొన్ని పదాలకు అర్థాలు సరిగా తెలుసుకోవాలి.  ఇక్కడ మదనము అంటే మదనుడు (మన్మధుడు) అనే వాడికి సంబంధించినది కాదు. మదనం అంటే ఉమ్మెత్త.  కుటజము అంటే కొండమల్లె. అన్వయంలో చమత్కారాలూ ఉన్నాయి: కోయిల వేసంకాలం వస్తుంది కాని కొండమల్లె వానాకాలం పూస్తుంది. 

అలాగే చదవగానే చాలా బాగుంది అనిపించే ఎవ్వని చేజనించు పద్యంలో తెలుగుమాటల బాగానే ఉన్నాయికదా? ఎవ్వని యందుడిందు అన్న ప్రయోగం చాల అందంగ ఉంది కదా? మరి డిందు అంటే అర్థం ఎంతమందికి చటుక్కున స్ఫురిస్తోంది నేడు? ఎవ్వడు ఎవ్వడు అంటూ పదే పదే అనటంలో పద్యం అందం ఇనుమడించింది కదా? జాగ్రత్తగా గమనించారా? ఈ‌శ్వరు నే శరణంబు వేడెదన్ అన్న ప్రయోగాన్ని? దీని అర్థం ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుతున్నాను అని కదా.  కొందరు పొరబాటుగా ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చదువుతారు. ఈశ్వరుణ్ణే శరణు కోరుతున్నాను అని అర్థం. రెండింటికీ కించిత్తుగా బేధం ఉందని గమనించారు కదా?

లా వొక్కింతయు లేదు పద్యంలో కూడా చాలా భాగం తెలుగు మాటలే. కాని ఇందులో విలోలము, ఠావు, డయ్యు అనే‌ కొద్ది మాటలు మనం జాగ్రత్తగా తెలుసుకుంటే అర్థం చాలా సులభంగా తెలుస్తుంది.

ఇంతకూ ఈ‌ పద్యాలను ప్రస్తావించి చెప్పదలచుకున్నది ఏమిటంటే, తగుమాత్రంగా సంస్కృతపరిచయం తప్పని సరి అనీ, కొన్ని కొన్ని తెలుగుమాటలూ నిఘంటుసహాయం లేకుండా నేటి వారికి బోధపడవనీ.  ఈ‌ నాడు సవాలక్ష కారణాల వల్ల సంస్కృతపదాల పరిచయం బాగా సన్నగిల్లింది. మరి ఒకప్పుడు ఈ సంస్కృతపదాల పరిచయం ఎలా కలిగేదీ‌ జనులకు అన్న సందేహం తప్పకుండా వస్తుంది.

సగటు తెలుగువాళ్ళు సంస్కృతాన్ని ఒక పాఠశాల సబ్జెక్టుగా చదువుకున్నది ఎప్పుడూ‌ తక్కువే. నాకైతే, నేను 8వ తరగతి వరకు గెద్దనాపల్లిలో చదువుకున్నాను అక్కడ హెడ్ మాష్టర్ మా నాన్నగారే. అక్కడి నుండి కొత్తపేటకు మా నాన్నగారికి బదిలీ కావటంతో నాచదువు కొత్తపేటకు మారింది. సంస్కృతం సబ్జెక్టుగా తీసుకునే అవకాశం కనిపించింది మొదటిసారిగా - కాని రూల్స్ ఒప్పుకోలేదు. అందుచేత నేనూ‌ సంస్కృతాన్ని ఒక సబ్జెక్టుగా చదువుకోలేదు. 

చిన్నప్పుడు నేను విపరీతంగా అల్లరి చేసేవాడిని. నా అల్లరిని అదుపు చేయటానికి మా నాన్నగారు చాలా ప్రయత్నించి చివరకు ఒక ఉపాయం కనుక్కున్నారు.  నా దృష్టిని పుస్తకపఠనం వైపు మళ్ళించారు.  అది పనిచేసి నేను ఒక పుస్తకాలపురుగుగా మారిపోయాను. మా నాన్నగారు చిన్నచిన్న కథలపుస్తకాలతో మొదలుపెట్టి, ఒకసారి కాళహస్తీశ్వరశతకం, భాస్కర శతకం, దాశరథీశతకం కొని యిచ్చి దగ్గరుండి చదివించారు. 

మా నాన్నగారు చాలా శ్రావ్యంగా పద్యపఠనం చేసే వారు.  అందుచేత పద్యాలు నాకూ‌ ఆసక్తి కలిగించాయి. కాని,
మొదట్లో నాకూ‌ పద్యాలు అస్సలు అర్థం అయ్యేవి కావు.  మా నాన్నగారితో‌ మొఱపెట్టుకుంటే ఆయన నాతో, "అర్థం కాకపోయినట్లున్నా కొంచెం కొంచెంగా అవే అర్థం అవటం మొదలవుతుంది. చదవటం ఆపకు. క్రమంగా పదాలూ వాటి భావాలూ, వాటిని కవులు రకరకాల స్వరూపాలతో ప్రయోగించటాలు క్రమంగానే అవగాహనకు వస్తాయి. మంచి పదసంపదతో ఒక నాడు నువ్వూ‌ పద్యాలు వ్రాయవచ్చు"  ఆ మాటలు నా మీద ఎంతా బాగా పని చేసాయీ‌ అంటే పైన చెప్పిన పుస్తకాలే‌ కాక మా యింట్లో ఉన్న పోతన గారి దశమ,ఏకాదశ,ద్వాదశ స్కంధాల గ్రంధమూ, నన్నయగారి భారతమూ, తిక్కన గారి యుధ్ధపంచకమూ పడీ‌పడీ‌ చదివాను.  దానివలన నాకు కలిగిన ప్రయోజనం అద్భుతం. నేనూ పై తరగతులలోకి వచ్చేసరికి, ఉపాధ్యాయులు బోధించక మునుపే పాఠ్యగ్రంథాల్లో పద్యగద్యాదులన్నీ‌ స్వయంగా చదువుకునే వాడిని.   త్వరలోనే చిన్నగా పద్యాలు వ్రాయటమూ పట్టుబడింది. మా నాన్నగారు పద్యాలు వ్రాయగలిగే వారు - నన్నూ‌ ప్రోత్సహించారు. త్వరలోనే శ్రీవేదుల వేంకటరావుగారనే మా ఉపాధ్యాయులు నాకు మెళకువలు నేర్పారు.  ముఖ్యంగా నాకున్న పదసంపద, సంస్కృతపదాలలో దాదాపు ఆ రోజుల్లో సమకూర్చుకున్నదే.

ఈ నా స్వానుభవం ఎందుకు ఏకరువు పెట్టాను? తలిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో చక్కగా అధ్యయనం చేస్తే తెలుగుపద్యవిద్య మీద ఆసక్తి పట్టు చిక్కుతాయని చెప్పటానికే!

తెలుగుపద్యాలు నేటితరానికి కష్టంగా కనిపించానికి కారణం మీకు ఈ పాటికి బోధపడిందనుకుంటున్నాను.

ఇంకా ఉంది వ్రాయవలసింది.  ఇప్పటికే టపా పెద్దదయింది కాబట్టి ప్రస్తుతానికి విరమిస్తున్నాను.