29, జులై 2013, సోమవారం

పాహి రామప్రభో - 182

మనం‌ శ్రీరామచంద్రస్వామికి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకున్నాం.

ఒక చిన్న మాట. పలుకుబడిలో అర్ఘ్యపాద్యాలు అన్నది స్థిరపడింది.  కాని పాద్యం, అర్ఘ్యం‌ అనే క్రమంలో మనం ఆ ఉపచారాలను చేయాలి. గమనించండి.

ఇలా అర్ఘ్యపాద్యాలు ఇచ్చి స్వామివారిని సంతోష పరచిన తరువాత, మనం తదుపరి ఉపచారంగా స్వామికి ఆచమనీయం అనే ఉపచారం సమర్పించుకోవాలి.  ఆచమనీయం అంటే స్వామివారు అచమనం చేసుకోవటానికి స్వాదుజలం సమర్పించటం.

ఆచమనీయం

కం. రాకేందు వదన రామా
నీకన్న విశుధ్ధు లెవరు నిక్కంబరయం
గైకొను మాచమనీయము
శ్రీకర నా భక్తికలశశీతాంబువులన్


తాత్పర్యం. ఓ రామచంద్రా, పూర్ణచంద్రుని వంటి ముఖంతో ప్రసన్నంగా ఉండే చల్లని స్వామీ. నీకన్నా నిజానికి పరిశుధ్ధు లెవ్వరయ్యా? ఐనా ఆచారం ప్రకారం నీకు ఆచమనీయం సమర్పించు కుంటున్నాను.  స్వామీ, స్వీకరించండి. ఇవి నా భక్తికలశం అనే పాత్రలో నిండి ఉన్న ఉత్తమ జలాలు. (అంటే నా భక్తియే ఆ కలశంలో ఉదకరూపంగా ఉంది అని భావం) ఈ‌ జలం‌ చక్కగా నిర్మలంగా చల్లగా మీకు చాలా హితకరంగా ఉంటుంది.  దయచేసి మీరు ఈ జలాలు స్వీకరించి ఆచమించండి.

(జూలై 2013)