31, డిసెంబర్ 2013, మంగళవారం

మా తెలుగుతల్లికి మల్లెపూదండ

శ్రీ శంకరంబాడి సుందరాచారిగారు రచించిన ఈ పాటను టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో ఇక్కడ వినండి.


ఈ వీడియోలో ఉన్న మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాటను సూర్యకుమారిగారు 1985వ సంవత్సరంలో బర్మింగ్‌హామ్‌లో శ్రీరంగారాయ మెడికల్ కాలేజీ పాత విద్యార్థుల పునస్సమాగమం సందర్భంగా జరిగిన ఉత్సవంలో గానం చేసారు.
ఈ‌ పాట ఆంధ్రప్రదేశప్రభుత్వ అధికారిక గీతం.

ఈ‌ పాట పూర్తి పాఠం ఇదిగో:


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం


  ఈ పాట ఒరిజినల్ రికార్డింగ్ అంటూ మరొక వీడియో కూడా కనిపించింది:




అలాగే, బాలూగాత్రంలో ఇదే మా తెలుగు తల్లికి పాట కూచిపూడి నృత్యాభినయ యుక్తంగా:



ఈ పాటకు క్రొత్త వరస కూడా ఉన్నది! చూడండి: 



ఇంత చెప్పుకున్నాక మరొకటీ చెప్పుకోవాలి మరి. ఈ పాటకు తెలంగాణావాదుల పేరడీ చూడండి. 




(టంగుటూరి సూర్యకుమారిగారి గురించి వికీపీడియాలో చదవండి.) (శంకరంబాడి సుందరాచార్యులవారి గురించి వికీపీడియాలో చదవండి.)

25, డిసెంబర్ 2013, బుధవారం

విద్యుత్తు వినియోగమూ - పొదుపూ.

ఈ రోజున  ఇంట్లో రోజుకొక యూనిట్ విద్యుత్ పొదుపు చేయటం ఎలా?   అనే టపా చూసాను విజ్ఞాన శాస్త్రము  బ్లాగులో.  మంచి విషయం స్పృశించారు.  మంచి పొదుపు చిట్కాలు చెప్పారు.

మన వాడుతున్న విద్యుత్తును ఒక్కో ఉపకరణమూ ఏ విధంగా వినియోగిస్తోందో తెలుసుకోవటమూ ఈ విషయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక విద్యుదుపకరణం (electrical equipment) రేటింగ్ W వాట్లు అనుకుంటే,  సగటున దానిని మనం రోజుకు H గంటలు వాడుతున్నాం అనుకుంటే, ఒక సంవత్సర కాలంలో అది ఖర్చుచేసే విద్యుత్తు విలువ W x H x 365.25 వాట్లు అవుతుంది.  ఒక వేయి వాట్ల వాడకం అనేది ఒక యూనిట్‌గా లెక్కిస్తారు మీటరు రీడింగులో.

కాబట్టి సంవత్సరంలో మనం ఈ విద్యుదుపకరణం ద్వారా కర్చుచేసే యూనిట్లు W x H x 0.36525

మనకు నెలలో కాల్చే యీనిట్ల విలువ తెలుసుకోవటం ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది కదా.  ఈ విలువ  W x W x 0.36525 / 12 = W x H x .030437

ఈ గణితం పైకి పెద్దగా ఆసక్తి దాయకంగా కనిపించదు.  కాని దీని నుండి సులభంగా మనం గుర్తుపెట్టుకోవటానికి మార్గం కనుక్కోవచ్చును చూడండి.

పైన ఇచ్చిన గణితంలోని .030437 అనే విలువను  33 చేత గుణిస్తే 1.004421 వస్తుంది.  దశాంశ భాగం చిల్లర చాలా చిన్నది కాబట్టి దాదాపుగా ఈ విలువని   1 అనుకోవచ్చును.

అంటే?

W వాట్ల ఉపకరణాన్ని రోజుకు 33 గంటలు చొప్పున వాడితే (రోజుకు అన్ని గంటలా అని అనకండి, ప్రస్తుతానికి) ఒక నెలలో మనం కాల్చే విద్యుత్తు W యూనిట్లు అన్నమాట.

ఈ బండగుర్తు సహాయంతో సులభంగా మన ఇంట్లోని ప్రతి విద్యుదుపకరణం మీద నెలకి ఎన్ని యూనిట్ల విద్యుత్తును కర్చు చేస్తున్నదీ లెక్క వేయ వచ్చును.

ఉదాహరణకు ఒక సీలింగ్ ఫాన్ ఉన్నది.  దాని వాటేజ్ 72W అని తెలుసు అనుకుందాం.  ఆ ఫానును రోజుకు  8 గంటల చొప్పున వాడితే నెలకు మనం 72 x 8 / 33 = 17.45 యూనిట్లు కాల్చుతున్నాం అన్నమాట.(మనం ఖచ్చితంగా లెక్కిస్తే 72 x 8 x 365.25/12000 = 17.53  యూనిట్లు వస్తుంది)

మరొక ఉదాహరణ కోసం 2000 W రేటింగ్ ఉన్న గీజర్ వాడకం చూదాం.   ఆ గీజర్ని ప్రతిరోజూ ఒక గంట సేపు వాడితె మనం  ఒక నెలలో 2000 x 1 / 33 = 60.61  యూనిట్లు కర్చు చేస్తున్నామన్న మాట. (మనం ఖచ్చితంగా లెక్కిస్తే 2000 x 1 x 365.25 = 60.88 యూనిట్లు వస్తుంది)

పై ఉదాహరణలో వచ్చిన తేడా అలా 1.004421ని  1గా తీసుకోవటం వలన వచ్చిన చిన్న వ్యత్యాసం.  స్వల్పాంతరత్యశ్చ బహూపయోగాః. తత్యజ్యతే తన్నతు దూషణాయ అని ఒక సూక్తి. అంటే చిన్న తేడా వలన హెచ్చు ఉపయోగం ఉంటే అలా గ్రహించటం మంచిదే అని అర్థం.

మరొక విషయం.  ఒక 100W ఉపకరణం రోజుకు 10గంటల చొప్పున వాడితే ఒక కాలెండరు నెలలో ఎన్ని రోజులో అన్ని యూనిట్ల విద్యుత్తు కాల్చుతుంది.  ఆ నెలలో రోజులు 31 ఐతే 31 యూనిట్లు, రోజులు 30 ఐతె 30 యూనిట్లు, రోజులు 28 ఐతే 28 యీనిట్లు. ఎందుకంటే 100W ను పదిగంటలు కర్చుచేస్తే ఒక యూనిట్ కాబట్టి.  కాని మనం పైన లెక్కించిన విధానం ప్రకారం  100 x 10 x 365.25 / 12000 = 30.4375 యూనిట్లు అవుతుంది. ఇది సంవత్సరంలో సగటు నెల విలువ అని గ్రహించ గోరుతాను.  మన చేసే ఉజ్జాయింపు లెక్కప్రకారం ఐతే, 100 * 10 / 33 = 30.3030 యూనిట్లు వస్తుంది.   పెద్దగా చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదు.

ఈ క్రింద ఇచ్చిన పట్టిక గుర్తుపెట్టుకోవటానికి సులభంగా ఉంటుంది.  (ఉపకరణం వాటేజ్ W అనుకుంటే..ఉజ్జాయింపుగా విద్యుత్తు ఖర్చు)

రోజుకు వాడకం గంటల్లో నెలకు కరిగే యూనిట్లు ఏడాదికి కరిగే యూనిట్లు
 1:00 W/33 3W/8
 2:45 W/12 W
 5:30 W/6 2W
 8:15 W/4 3W
11:00 W/3 4W
13:45 5W/12 5W
16:30 W/2 6W
19:15 7W/12 7W
22:00 2W/3 8W
24:45 3W/4 9W



వగల ప్రేమలు?






[ ముందుమాట: నిన్న శ్రీగుండువారు వగల ప్రేమలు చాలు అంటూ ఒక ఖండిక ప్రకటించారు. అందులో వారు సీమాంధ్రవాళ్ళు నీలంవారి శతజయంతిని ఘనంగా నిర్వహించి పీవీగారి వర్థంతిని ఏమాత్రం పట్టించుకోకుండా అవమానించారని ఆరోపిస్తూ "ఆ మహాత్మునికి జయంతి యంత ఘనము!యీ మహాత్ముని వర్థంతి యింత వెగటె?" అని అన్నారు.

వారి ఆ టపాకు నా స్పందన పంపితే అందులో బహుశః వారి దృష్టిలో సద్విమర్శాగౌరవానికి నోచుకోకపోవటం వలన కాబోలు ఆ నా స్పందనను ప్రకటించలేదు.  అలా జరగటం సాధారణవిషయమే కాబట్టి, అ స్పందన ప్రతిని అక్షరదోషాల వంటివి దిద్ది, చివరన ఒకటి రెండు వాక్యాలు చేర్చి ఒక టపాగా వేస్తున్నాను ఈ‌ బ్లాగులో.]

బాగుంది.  ఆడిపోసుకోవటం ఆపి, ఒక్క ముక్క ఆలకించండి.

నిజానికి దివంగత మహనీయులైన నీలంవారిని గాని పీవీగారిని గాని ఎవరు కించపరచటమూ హర్షణీయం కాదు.

మాజీ రాష్ట్రపతి నీలంవారి శతజయంతి మీరు అనుకుంటున్నంత ఘనంగా జరగనేలే దన్నది పచ్చినిజం.  ఆ వేడుకేదో అంతంతమాత్రంగానే జరిగినా, పీవీగారి వర్థంతి అంతమాత్రంగా కూడా జరగలేదని మీ అనుమానం కావచ్చును.

పీవీగారిమృతి సందర్భంగా స్వంతపార్టీకి ఎంతో‌ఘనకీర్తి తెచ్చిపెట్టిన ధీవిశాలుడైన పీవీగారికి కాంగ్రెసుపార్టీవారు ఎంత ఘనంగా అంతిమమైన వీడ్కోలు పలికారో తలుచుకుంటే ప్రతితెలుగువాడి హృదయమూ బాధతోనూ కోపంతోనూ ఊగిపోతుంది.  ఘోరావమానంగా జరిపించారు కాంగ్రెసువారు ఆ మహానేతకు వీడ్కోలు.  ఇదంతా సోనియమ్మగారి ఆధ్వర్యంలోనే జరిగింది.  కాదని బుకాయించే అమాయకులుంటారని అనుకోను.  ఆ విధమైన దుష్ప్రవర్తనతో పీవీకి అవమానం జరిపించిన సోనియాను నేడు నెత్తిన పెట్టుకొని దేవతలాగా కొలుస్తూ, ఆమెకు గుడులూ గోపురాలు కడుతూ తెలంగాణావీరజననాయకమ్మన్యులు కూడా పీవీగారి దివ్యస్మృతికి ఎటువంటి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.  అది మాని సాకులు వెదకుతూ దివారాత్రములూ నిత్యం సీమాంధ్రులను తిట్టిపోయటమే పనిగా పెట్టుకోవటం అనేది మంచి పనేనా?  అలోచించుకోండి.

ఒక్క విషయం గ్రహించండి.  తెలుగువారికి ఢిల్లోలో  ఎన్నడు సరైన గౌరవం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ అక్కడ అంతా అరవపెత్తనం.  స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు తెలుగువారి ఆత్మగౌరవం  అనే నినాదంతో కాంగ్రెసువారికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి అది కూడా ఒక ప్రధాన కారణం. వీలైనప్పుడల్లా తెలుగువారిని అవమానించటానికి అక్కడ నిత్యం ప్రయోగాలమీద ప్రయోగాలు నడుస్తూ ఉంటాయి. ఈ రోజు చిదంబరమూ ఆ తానులో ముక్కే - మీ కేదో నేడు ఒరగబెడుతున్నాడని కాక విస్తృతమైన పరిధిలో ఆలోచించగలిగితే మీకూ‌ బోధపడుతుంది.

ఇకపోతే తమ ఖండికలో శ్రీగుండువారు యధాప్రకారం తమ ధోరణిలో సీమాంధ్రులపై "స్వార్థపరులయ్య మీరలు స్వార్థపరులు" అనీ, "హృదయాన ఘోర విషము దాచుకొన్నట్టి మీర లధర్మపరులు"అనీ,  "నీది నటనె" అనీ పాత నిందారోపణలనే పునరుద్ఘాటించారు.  

14, డిసెంబర్ 2013, శనివారం

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే
శమముషి భుజవీచివ్యాకులేఽగాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్నః క్లేశమద్య త్యజామి



ఒకడొకానొక యెడారిలో పడి పోవుచుండెననగా వాని యవస్థ దుర్భరముగా నుండు నని లక్షవాక్యములలో చెప్ప నవుసరము లేదు.  కాళ్ళు బొబ్బలెక్కును కాని నీడ దుర్లభము. ఆకలి దహించును కాని తిండి దుర్లభము.  దప్పికతో నలమటించును కాని నీటి జాడ దుర్లభము.  వీటికి తోడుగా కొన్ని యెండమావులు కనిపించి యాడించును.  వాని యందు కనిపించు నీటికై యాసపడి యట్లే పరువెత్తుకొనుచు పోయి పోయి మరింత దుఃఖమనుభవించును.

ఈ సంసారము కూడ యెడారి వంటిదే.  జీవుల ప్రయాణములో నిచట నటువంటి బాధలే కలుగును. విశ్రాంతి యన్నది లేక ఈ సంసారములో పడి జీవుడు నడచు చుండును.  ఆకలిదప్పులవంటి ఆశామోహములను పొంది వాటిని అందించునట్లు భ్రమింపజేయు ఎండమావులవంటి యింద్రియసుఖములు వెంబడి పరువులెత్తుచు క్లేశములు పొందుటే జీవితములో హెచ్చుభాగమైన కార్యక్రమము కదా.

కాని ఈ సంసారములోని జీవుడు సరిగా నన్వేషించినచో నొక చక్కని కాసారము కనబడును.  అది భగవతుండని పేరు గలది!

ఎంతో అందమైన పద్మములున్నవి దానిలో.  అవి భగవంతుని యొక్క దివ్యమైన కరచరణములే.

ఎంతో చక్కని దివ్యకాంతులీను చేపలు సంచరించునా కాసారములో.  అవి భగవంతుని యొక్క దివ్యకృపాకటాక్షవీక్షణాప్రసార మొనరించు చున్న నేత్రములే సుమా.

ఆ భగవంతుడనే కాసారము లోని జలములు అమృతమే.  అన్ని విధములైన క్లేశములను తొలగించి హాయి గొలుపునా అమృతజలములు.

భక్తునకు భగవంతుని కృపాజలప్రపూర్ణమైన దివ్యకాసారము లభించినది.  అతడు సంతోషముగా ఎలుగెత్తి పలుకుచున్నాడు.

ఈ సంసారమనే ఎడారి బాధ నుండి విముక్తి లభించినది.  
ఇదిగో‌ ఈ‌ క్షణమే దీనిని విడిచిపెట్టున్నాను



స్వేఛ్ఛానువాదం:

తే. కరచరణములు పద్మముల్ కన్నులనగ
నందమై నట్టి చేపలౌ హరిసరసియె
పరమకరుణాంబుపూర్ణమం చరసి యిపుడె
పాడు సంసారమరుభూమి వదలినాడ


13, డిసెంబర్ 2013, శుక్రవారం

చింతయామి హరిరేవ సంతతం

చింతయామి హరిరేవ సంతతం
మందహాసముదితాననాంబుజం
నందగోపతనయం పరాత్పరం
నారదాదిమునిబృందవందితం


శ్రీహరిని చింతన చేయవలెను.  అది శుభప్రదము.  శుభ మనగా మోక్షమనియే యుద్దేశము.   హరిని మాత్రమే చింతచేయవలెను.  అన్యదేవతలను చింతించుట వలన కలుగు ఫలములు స్వల్పములు.  అట్టి దేవతలను చింతించుట వలన ఎంత గొప్ప ఫలము కలిగినను అది మోక్షమునకు సమానము కాదు గదా.  అందుచేతనే,  హరిరేవ సంతతం అని హరిని మాత్రమే ఎల్లప్పుడును నిష్ఠగా చింతించుచున్నానని కవి చెప్పుచున్నాడు.  దైవ చింతనమనగా వీలు చిక్కినప్పుడు కాలక్షేపమునకు చేయదగినది కాదు.  అది నిత్యముగా మనఃపూర్వకముగా చేయవలసినది.  ప్రహ్లాదాదులకు నిద్రలో కూడ హరినామస్మరణము మరుగు కాలేదని గదా ప్రతీతి.  అట్లన్న మాట.  ఎప్పుడు హరిస్మరణము జరుగుచున్నదో అప్పుడు హరియొక్క సుందరాతిసుందరమైన ముఖారవిందమును, అది అనుగ్రహ పూర్వకముగా చిందించుచున్న చిరునవ్వులును మనస్సులో రూపు కట్టవలెను.  ఇట్లు చెప్పుట యెందుకనగా, యాంత్రికముగా నోటితో హరినామమును జపించుట కాక అది మనఃపూర్వకముగా చేయవలసినదిగా చెప్పుటకే.  మరొక విషయమేమనగా అట్టి స్మరణము ప్రేమపూర్వకమైనది.  అట్లైనప్పుడే కదా, హరి యొక్క అందమైన నగుమోము మనస్సులో రూపించుట? ఆ హరి నందగోపునకు దయతో కుమారుడైన వాడు.  ఆయన పరాత్పరుడు.  అయనకు నిజముగా తండ్రి యెవడు?  కాని నందుడు చేసుకొన్న పూర్వపుణ్యప్రభావము చేత, ఆయనకు శ్రీహరి స్వయముగా పుత్రుడై అలరించెను.  అనగా ఆయన అనుగ్రహము ఎంత గొప్పగా ఉదారముగా నుండునో మనము అర్థము చేసుకొన వలసినదే కాని వర్ణించలేనిది. అర్థము చేసుకొని తరించుటకు కూడ పెట్టిపుట్టవలెను.  నారదాదులు అట్టివారు.  వారు శ్రీహరిపట్ల పరమప్రేమతో తరించిరి.  అందుచేత శ్రీహరి వారి హృదయములలో నిత్య నివాసియై యుండును.  ఆ మహాత్ములకు శ్రీహరి స్మరణకీర్తనములు తప్ప వేరు కార్యక్రమములే యుండవు.   సారాంశ మేమనగా, శ్రీహరిని మిక్కిలి ప్రేమతో నిత్యమును స్మరించుచు నా పరాత్పరుని నగుమోమును హృదయకమలమున నిత్యము దర్శించుచు తరించవలె ననుట.


స్వేఛ్ఛానువాదం

ఆ.వె. నందగోపతనయు నారదాదిమునీంద్ర
వంద్యు హాసపూర్ణపద్మముఖుని
పరమపురుషు హరిని భావింతు నేవేళ
చిత్తమందు భక్తి చెలగుచుండ



సాగతీత?


అదిగో వచ్చెను తెలగాణా బిల్!
వచ్చెనసెంబ్లీ చర్చలకొరకై!
ఒకటో రెండో మూడు రోజులో
సమయం పట్టును చర్చలకొరకై!


ప్రత్యేకంగా యుధ్ధవిమానం
మోసుకు వచ్చెను విభజన బిల్లు
శ్రధ్ధగ చదివిన పిమ్మట చర్చకు
దిగవలె తొందరపడరాదండీ

కానీ, బిల్లుకు ప్రెసిడెంటిచ్చెను
ఆరువారముల సమయమ్మిప్పుడు!!
ఇంత సమయమ్ము నిచ్చుట కేదో
బలమైన కారణమ్ముండవలెనయా!


చర్చకు తగిన సమయం బిచ్చుట
సంప్రదాయమని మరువరాదయా
ఎప్పటిలాగే ఆరువారముల
గడువు నిచ్చిరని గమనించుడయా

అనుమానమ్మెదొ పొడసూపెను మది!
కాలమిచ్చి యిక సాగదీయుటకె
కాదుగదా సీమాంధ్రుల కుట్రల
లాబీయింగుల మహిమమ్మిదియే?


లాబీయింగులు సీమాంధ్రులకే
కలిసొస్తే యీ బిల్లొచ్చేనా
లేనిపోని యారోపణలెందుకు
చీటికిమాటికి చిందులెందుకు

కేంద్రము పూనిన కార్యము చక్కగ
సకాలమ్ములో నెరవేరును గద!
భేషు భేషనును తెలగాణమ్మే!
దీప్తిమంతమై కాంగ్రెసు వెలుగును!!


కేంద్రము చేసిన దుష్కార్యములే
కాంగ్రెసు నిప్పుడు కాటికి పంపును
కాలము చెప్పును కలసి వచ్చునది
తెలంగాణకో సీమాంధ్రముకో

త్వరత్వరగా చర్చల జరిపించియు
కేంద్రముకంపగ యత్నించుటయే
ముందరనున్న మహత్కార్యమ్మిది!
తాత్సారమ్మిక చేయగనేలా


ఎందుకు లెండి హడావుడి పడటం
కేంద్రం‌ కరుణకు గడబిడపడటం
మహత్కార్యమో దుష్కార్యమ్మో
సమయం తీసుకు చర్చించవలె

కుట్రచేయుచో తిప్పికొట్టెదము!
మంచికేయైన కొనియాడెదము!
త్వరగా తేల్చుడు వారములోనే
త్వర త్వర త్వర త్వర త్వర త్వరగా!!


కొత్తగడువులను పెట్టేటందుకు
మీరెవరయ్యా తప్పుగదయ్యా
మీ దూషణలకు చింతించరయా
మీ మెప్పులతో పనిలేదయ్యా

(ఇది శ్రీగుండువారి సాగదీత...కుట్రేనా?  అనే టపాకు స్పందన)


11, డిసెంబర్ 2013, బుధవారం

ఆశ..దోశ.. అంటే సరా?



సమైక్యాంధ్రయె వలయునంచును
తెలంగాణము బిల్లు వచ్చిన
అసెంబ్లీలో ఓడజేతుమ
టంచు పలుకకయా! 

ఎందుకొచ్చిన బిల్లు బాబూ
ఎవరికోసం వ్యర్థచర్చలు
పనికిమాలిన బిల్లు వచ్చిన
ఓడిపోవుట తప్పునా

 
బిల్లు వచ్చిన చర్చ సేయుడు!
రాదు ఓటింగునకు నదియే!
ఆర్టికలు మూడునను నిదియే
చెప్పబడెనయ్యా!

ఓడినా పట్టించుకొననిది
చర్చచేయుట దండుగే కద
పనికిమాలిన చర్చ కోసం
మూడునంబరు ముచ్చటా

 
అవిశ్వాసమదేమియైనను
పార్లమెంటున తెలంగాణము
బిల్లు పెట్టుట తథ్యమయ్యా!
కండ్లు తెరువుడయా!

 

తెలుగుజాతిని పార్లమెంటున
తుంచి మీతో లాభ మెంచే
వారి స్వార్థములోని కుటిలత

తెలిసి కన్నులు తెరువుడీ
గౌరవము కాపాడుకొని మీ
రిట్టి బిల్లును చర్చ సేయుడు!
పెద్దరికమును నిలుపుకొనుడయ!
వెలిగిపోవుడయా!

 

ఇట్టి బిల్లును గూర్చి చర్చలు
చేసి మురిసే పెద్దరికమును
బుధ్ధిహీనులు తప్ప గోరరు
ఛీ కొట్టి నెట్టెదరోయ్

( గమనిక:  ఇక్కడ ఆకుపచ్చరంగు లోనిది శ్రీగుండువారి   ఆశ...దోశ...అప్పడం...వడ... టపాకు నా స్పందన.  ఆ టపా శీర్షిక చూస్తే వెక్కిరింత,  విషయప్రస్తారం చూస్తే బుజ్జగింపుధోరణిలో బెదిరింపు! )

6, డిసెంబర్ 2013, శుక్రవారం

తెగతెంపుల నిర్ణయం వెలువడింది.

తే. ఆంధ్రజాతికి దుర్దిన మాయెననగ
విభజనము కోరు వారికి వేడుకనగ
నిర్ణయము వచ్చె తెలుగింట నిప్పుపుట్టె
ముందుముందేమి పుట్టునో యిందువలన

వ. కొందఱ కిది స్వాతంత్యసిధ్ధి యట!

సీ. పూర్ణస్వాతంత్యంబు పొల్పెట్టు లుండునో
      ప్రత్యేకదేశమై వరలు వారొ
సర్వస్వాతంత్యంబు చాడ్పెట్టులుండునో
      భరతదేశంబులో వారు గారొ
అరువదేండ్ల స్వప్న మందురే పెక్కేండ్లు
      విభజనోద్యమమెందు విడిసి యుండె
అమరవీరులు కల రధికులీ యుద్యమ
      రాజకీయమునకే రాలినారు

తే. అనుదినంబును నింద లన్యాయ భాష
ణంబు లివి యెల్ల ధర్మాగ్రహంబు పేర
నిన్ని నాళులు దాయాదు లన్న మిషను
వేలు చూపించి కురిసిరీ వీరు లకట
 
తే. వేరు కాపురములు వీలుగా కుదిరెను
చాలు దాయాదులను మాట సఖ్య మొప్ప
అన్నదమ్ముల మగుటయే యెన్న దగిన
బాంధవంబను తీయని పలుకు పుట్టె
 
తే. రాష్ట్రములు వేరు తెలుగువా రంద రొకటె
యన్న సొంపైన మాట యే మంత పొసగు
తిట్లు కురిపించుటయు చేరదీయుటయును
వారి చిత్తంబు వీరి సౌభ్యాగ్య మగునె
 
ఉ. కాలము చేత సర్వమును గల్గుచు నుండును క్రిందుమీదులన్
కాలము చేయ కొందరధికంబగు మోదము నొంద కొంద రార్తులై
బేలతనంబు బొందుటయు వింత యనంగ రాదు గర్వశోకముల్
కాలము వేఱు భంగి చనగా విపరీతము లౌటయు పుట్టు చుండెడిన్

క. కాలము నీదు స్వరూపము
నీ లీలకు తిరుగు లేదు నీ వేదో పె
న్మేలెంచి చేయుచున్న ద
దే లాగున తెలియ నేర్తు మీశ్వర చెపుమా
 
శా. తౌరక్యాంధ్రము కోరి కొందరు మహాదోషాచరుల్ దీక్షమై
పోరంబోరగ వారి యాశ లవి సంపూర్ణంబుగా దీరు చో
నేరం బేమియు లేని శిక్ష పడి యీ నిర్భాగసీమాంధ్రు లీ
ఘోరం బింక సహించి యుండవలెనా కోదండరామప్రభూ

సీ. కాంగిరేసును వల్లకాటికి పంపక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
భాజపామూర్ఖుల పట్టి పల్లార్చక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
సీమాంధ్రమంత్రుల చెత్తగా నూడ్వక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
సోనియమ్మకు చెప్పుచూపించు నందాక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
 
ఆ. తెలుగుజాతిపరువు దిల్లీబజారులో
అమ్ముకొన్న దుష్టు లల్పమతుల
రేపు శోకవహ్ని రూపర జేయక
ఆంధ్రజాతి కోప మణగు టెట్లు

తే. అన్నిటికి నీవు గలవని విన్నవించి
యూర కుందును శ్రీరామ యుచిత మైన
భంగి విభజనవాదుల భంగపరచి
బుధ్ధి చెప్పుము దుడు కారిపోవు నట్లు

2, డిసెంబర్ 2013, సోమవారం

హైదరాబాదు విషయంలో ఉభయపక్షాలకూ విజ్ఞప్తి.

వ. ఓ సీమాంధ్రప్రజలారా,

మన మిక హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా? 

మన మందరము తెలుగువారము, ఆంధ్రప్రదేశము మన తెలుగువా రందరిది, యీ రాజధాని మన తెలుగువా రందరిది యని భావించి మోసపోతిమి గదా!
 
సీ. రాష్ట్రప్రజల కెల్ల రాజధాని యటంచు
     భావించు కొనుటయే ప్రజల తప్పు
అందరి యూరని యతినమ్మకంబున
     పెంచి పోషించుటే పెద్దతప్పు
ఇన్నాళ్ళు  ప్రేమతో నీ‌ భాగ్యనగరమ్ము
      మన దను భ్రాంతితో మనుట తప్పు
ఇచట చేరిన వారి నెల్లర దూషించు
     మాన్యుల నెఱుగమి మనది తప్పు

తే.ఇన్ని తప్పులు చేసిన దెందువలన
ఇన్ని నిందలు మోసిన దెందువలన
ఇన్ని నాళులు తెలియలే దెందువలన
అసలు తెలుగువార లుదారు లందువలన
 
సీ. మన యైకమత్యంబు మన్ను మశానంబు
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె
మన యతి నమ్మక మను బలహీనత
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె
మన బుధ్ధి కీ యూరు మనదని తోచుట
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె
మన సంపదలు దెచ్చి ఘనముగా పెంచుట
     మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె

తే.  ఒకరి నన నేల బుధ్ధి లేకుండ మనము
తెలుగు జాతి యంతటికి నుద్దిష్టమైన
పట్టణం బని హైదరాబాదు మీద
మమత గొని యుంట మన నోళ్ళ మట్టి గొట్టె
 
తే. హైదరాబాదు మీ కొక యద్దెకొంప
హైదరాబాదుపై మీకు హక్కు లేదు
పూని యైదేండ్లలో రాజధాని కట్టు
కొనుడు సీమాంధ్రులను మాట కూడ బుట్టె
 
కం. తగదట యూటీ చేయుట
తగునట యీ యూరిపైన తమ పెత్తన మ
ట్లగుచో సీమాంధ్రుల పై
పగగొని యగచాట్లు పెట్ట వచ్చును గనుకన్
 
కం. కాలము వ్యత్యస్తంబై
చీలికలై రాష్ట్ర మిటుల చెడు చుండగ నిం
కేలా చింతించుట యే
మేలగు కీడగును కాలమే చేయుగదా
 
కం. రేపో మాపో కాలం
బా పక్షము నుండి మరలి యరుదెంచునుబో
కాపాడును దైవంబని
యోపికగా నెదురుచూడు డో జనులారా
 

వ. ఓ వీరతెలంగాణా వాదులారా!
 
కం.  తెలగాణరాష్ట్రపాలన
తెలగాణపుదొరల దగుట దివ్యంబుగ మీ
వలసిన రీతిని మీదగు
కెలనన్ మీ రేల వచ్చు కేరింతలతో
 
కం. ఉమ్మడి యూరికి పెత్తన
మిమ్మని మీ రిట్టు లడుగు టేమి యుచిత మా
యుమ్మడి యగు కాలంబును
పొమ్మన నిం డవల మీది ముమ్మాటికిని నౌ


కం. విను డెల్ల రాత్మగౌరవ
మనగా తెలగాణ వారి కది యెట్లగునో
చను నటు సీమాంధ్రులకుం
జనులకు సామాన్యమగుట సర్వవిధములన్


కం. దినదినమును సీమాంధ్రుల
పనిగొని నిందించి యిట్లు పరమానందం
బును బొందుచుండి వదరుట
నొనగూరెడు లాభ మొక్కటి గలదే


కం. మంచిది మీ రడిగిన వే
కొంచెంబును గోత పెట్టకుండగ హితులై
పంచెడు వా రిడు చుండగ
కించిత్సంశయము పేర కీడెంచదరో


కం.  ఇచ్చెడు వారలు గలిగిన
ముచ్చటగా భూమి నెల్ల మోమోటము లే
కచ్చముగా మా కిండని
హెచ్చిన గరువమున గోర నెంచెదరు గదా!


కం.  ఇక దేనికి మీ వగపులు
ప్రకటంబుగ కాలమహిమ వలనన్ రాష్ట్రం
బిక చీలుటయే తథ్యం
బకటా పగ లుడిగి శాంతులై యుండదగున్

1, డిసెంబర్ 2013, ఆదివారం

in the days of Intellegint biological machines.



Kids are intelligent biological machines in learning process.

Youngsters are intelligent biological machines in earning process.

Oldies are intelligent biological machines waiting to be recycled.

A family is a smallest collection of intelligent biological machines working together.

Society is the largest collection of intelligent biological machines working together.

A State is the collection of intelligent biological machines working together and communicating in a given protocol.

The world is the universal collection of  intelligent biological machines found on the globe at any given point of time.

Death is the point of no return for an intelligent biological machine as it ceases to work.

Birth is the point of entry for an intelligent biological machine into the contemporary world.

Emotion is an ancient word that used to describe a humanitarian reaction to an external stimulus before intelligent biological machines replaced the human race due to efficiency reasons.

Moral behaviour is a protocol used by intelligent biological machines to prevent them accidentally confronting one another. 

The now extinct human race used to communicate in inexact and unnatural coding languages which ironically were then called 'natural' languages.

There are traces of some evidences that intelligent biological machines may have been ushered on to the globe by the now extinct human race! 



24, నవంబర్ 2013, ఆదివారం

అదే పనిగ రామరసాయనము గ్రోలరే





అదే పనిగ రామరసాయనము గ్రోలరే ప్ర

హ్లదనారదాదుల వలె యాడి పాడరే



పామరులను ఋషుల జేయు రామమంత్రము సీ

తామహాసాధ్వి మదిని దలచు మంత్రము

కామక్రోధసర్పములను కట్టు మంత్రము మీ

కామిత మగు మోక్ష మిచ్చి కాచు మంత్రము

రామనామరసాయనము తాము గ్రోలరే

రామమంత్రజపము చేసి రాణకెక్కరే



సదాముదావహము రామచంద్ర ధ్యానము సం

పదలు విరుగకాయు పాదు రామధ్యానము

సదాసదాశివుడు ప్రీతి సలుపు రామధ్యానము ఆ

పదల నుండి కాచు నట్టి భవ్యధ్యానము

రామనామరసాయనము తాముగ్రోలరే

రామధ్యానరక్తు లగుచు రాణకెక్కరే



విమలవేదాంతవేద్య రామతత్త్వము చి

త్తమున ప్రకాశింప జేయు విమలౌషధము

కుమతుల కిది దొరుక దండి కోరి సుజనులు ని

త్యమును గ్రోలు చుండు నట్టి యమృతౌషధము

రామనామరసాయనము తాము గ్రోలరే

రామతత్త్వ మెఱిగి మీరు రాణకెక్కరే




(ఈ కీర్తన సృజన పత్రిక నవంవరు 2013 సంచికలో ప్రచురించబడింది)


23, నవంబర్ 2013, శనివారం

భద్రాచలం విషయంలో సీమాంధ్రులకు విజ్ఞప్తి.

నేడు మాన్య కవిపుంగవులు శ్రీ గుండు మధుసూదనులవారు మావి మావి యనంగనె మీవి యగునె "నోరు మూయుఁడు! మాటలు మీఱఁ బోక, పరువు దక్కించుకొనుఁడయ్య పలుకుఁ దక్కి" యని నిందాపూర్వకముగా బహుతీవ్రస్వరముతో కవిత్వము వ్రాయుట జరిగినది.  వారి భావన వారిది.  వారిట్టి ధోరణిలో వ్రాయుట క్రొత్తగాదు.  దానికి సీమాంద్రులు నొచ్చుకొన బనిలేదు.  నొచ్చుకొని ప్రయోజనమును లేదు.  సాటి తెలుగువారి  మనోభావముల నవమానపరచుటలో గుండువారికి వినోదము కలుగవచ్చును.  కాని గాయపడిన సీమాంధ్రులకు కొన్ని స్వాంతన వచనములను చెప్పబూనుట తప్పని సరియని భావించి కొంత వ్రాయవలసి వచ్చుచున్నది.  ఈ వ్యాసములో ఏ పక్షము వారిని గాని యధిక్షేపించు కార్యక్రమము లేవియును లేవు.  ఎవరైన భుజములు తడవుకొనట తటస్థించినచో దానికి నేను చేయగలుగునది కూడ లేదు.

అయ్యా అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుండైన శ్రీహరిచే నమరించబడిన  సమస్త ప్రపంచంబు నందు గల యశేషశ్రేష్ఠ ప్రాంతవస్తుజనాదికంబును కేవలము తెలంగాణమువారి యాజ్ఞకును హక్కుభుక్తంబులకును లోనుగా వలసినవియే గాని తదన్యంబులు గానేరవు.  తెలంగాణమువారు తమకు నిరుపయోగంబని భావించి విసర్జించి యన్యులకు కృపతో నాజ్ఞ శాయించి యనుగ్రహించినట్టి ప్రాంతవస్తువిశేషంబులు మాత్రము తెలంగాణేతరప్రాంతీయులకు వినయపురస్సరంబుగా స్వీకరణయోగ్యంబులై యున్నవి.  ఈ విషయంబునందు తెలంగాణేతర ప్రాంతవాసులు నిరుపయోగమైన వాదనలకు దిగరాదని విజ్ఞప్తి.

నేడు కాలము తమ కనుకూలంబుగా వర్తించు చున్న దని తెలంగాణము వారలు మిక్కిలి సంతోషముతో నున్న పరిస్థితిలో నితరులు వృధావాదంబులతో తెలంగాణాప్రజలకుగాని తెలంగాణాప్రాంతనాయకులకు గాని క్రోధవిచారంబులను కల్పించు వాక్క్రియావ్యవసాయంబులకు పాల్పడరాదు.  అట్లుపాల్పడియును కార్యంబు లేదు గావున తెలంగాణేతరులు ప్రాప్తకాలజ్ఞులై పరమేశ్వరానుగ్రహంబునకు వేచి యుండవలసినదిగా తెలియగలరని ఆశించుచున్నాను.

మన విచిత్రప్రజాస్వామ్యనామకకాంగ్రేసుపాలనావ్యవస్థావిశేషవిజ్ఞతాకారణముగా కాంగ్రేసువారి స్వప్రయోజనమే దేశప్రయోజనము గాన, వారు దొరతనములోనుండి శాయించిన శాయించుచున్న మరియును శాయించగల సమస్తమైన శాసనంబులచేత బధ్ధులైన దేశప్రజలకు పరమేశ్వరానుగ్రహంబు దప్ప విమోక్షణావకాశము గలుగు నుపాయంబు మృగ్యంబు.  ప్రస్తుత మా కాంగ్రేసుదొరతనము వారలీ  ఆంధ్రప్రదేశంబు నుండి తెలంగాణమును విడదీసి ప్రత్యేక మగు రాష్ట్రంబుగా నేర్పరచుట యందే తమకు విశేషంబగు ప్రయోజనంబు సంఘటిల్లు నని భావించి తదనుగుణంబులగు చర్యలయందు  నిమగ్నులై యున్నారు కావున తత్తద్విషయంబులను గూర్చి ప్రశ్నించుట దుస్సాహసముగా భావించబడు చున్నది.

ఇట్టి తరుణమందు న్యాయాన్యాయంబులను గురించి గాని ధర్మాధర్మంబులను గురించి గాని యుభయప్రాంతంబులందు వసించు చున్న ప్రజలకు కాలక్రమంబున వాటిల్ల గల కష్టనష్టంబులను గురించి గాని విశాలదేశప్రయోజనంబులకు భవిష్యమందు సూచితమగు చున్న ప్రమాదంబులను గురించి గాని కాంగ్రేసువారితో గాని ఆనందడోలికలలో దేలియాడు చున్న  తెలంగాణము వారికి గాని వివరించి విన్నవించి వాదించి యుపయోగము లేదు.  కాంగ్రేసు దొరతనము వారికి  ఆసన్నవిపదోల్లంఘనాప్రయోజనకారియును సార్ధకనామధేయుడైన రాహులుని పట్టాభిషేకమునకు తోడ్పడునదియును నై యున్న కార్యమే ముఖ్యము గాని కించిద్విషయంబులైన దేశప్రయోజనాదులు కావు. తెలంగాణామువారికి వారి మనోభీష్టము నెఱవేరి తెలంగాణము ప్రత్యేకరాష్ట్రముగా నావిర్భవించుటే ముఖ్యము గాని దానివలన నితరులకు గలగు వెతలతో గాని దేశప్రయోజనము వంటి  యల్పవిషయముతో గాని యిసుమంతైననను పని లేదు.  పని యుండవలయు నని భావించుట అమాయకత్వము. అనగా రాజకీయముల తీరు దెన్నులను గ్రహించ లేక పోవుట.  దీనిని కాంగ్రేసు దొరతనము వారు దుస్సాహసుముగా పరిగణించి శిక్షింతురు మరియును తెలంగాణమువారు దుష్టత్వముగా పరిగణించి  క్రోధపరవశులై యీసడించి దూషించి శపించి పట్టి పల్లార్చగలరు. కావున తస్మాత్ జాగ్రత జాగ్రత యని తెలియ జేయడమైనది.

ఇది యంతయును యావద్దేశవాసులైన తెలుగువారును బాగుగా గ్రహించి కాంగ్రేసు దొరతనము వారితో గాని తెలంగాణము వారితో గాని యీషణ్మాత్రంబును విబేధించక వారి కోరికమేరకు వర్తించుట కాలోచితమైన కార్యము. ఈ తెలుగుగడ్డను నేటి దనుక నెందరో పరాయివారు పాలించలేదా మరియును ఖండఖండములుగా విభజించి పాలించలేదా యని యూరడిల్ల వలసినది. ఈ విషయములో కాంగ్రేసుదొరతనము వారి యొద్ద పెద్దపాలేర్లుగా పనిచేయుచు హస్తినాపురవాస్తవ్యులై చెలంగుచున్న మన కేంద్రమంత్రులు మిగుల బుధ్ధిమంతులై యున్నట్లు తోచుచున్నదన్న నతిశయోక్తి యించుకయును లేదు కదా. వారు సేవాధర్మపరాయణులై తెలుగు జాతిలో కొందరు ప్రాప్తకాలజ్ఞులు నేటికిని కలరని చాటుట మిక్కిలి ముదావహము మరియు తెలుగుజాతి యని యొకటి నిజముగా నున్నచో దానికి నిశ్చయముగ గర్వకారణము.

కాల మన్నది  యొకే తీరుగా నుండదని మనకు తెలియని విషయము కాదు.  చక్రనేమిక్రమముగా  నుండును గదా దాని విధానము.  నీచైర్గచ్ఛత్యుపరి చ దశా చక్రనేమి క్రమేణ యనియును సుఖం దుఃఖం భ్రమత్యేవ చక్రనేమి క్రమేణ చ  యనియును గదా వినబడు చున్నది.  నే డొకరికి మంచి రోజు వచ్చిన రేపు మరొకరికి రావచ్చును.  ఇంత సామాన్యమైన దానికి  కాలబలగర్వితులు కన్నుమిన్ను గానక సాటివారిని  విషముఖులని నిందించుచుటయును నోళులు మూసుకొమ్మని దూషించుటయును కేవలము పిల్ల చేష్టలు. కాని కాలవంచితులీ మాటలు పడక తీరదు కదా.  పోనిం డిట్లు పడ్డ వారందరును చెడ్డవారు కాదనెడు సామెతను గురుతు చేసుకొని వారు దురపిల్లుట మాని యూరడిల్లక తీరదు.  ఏ పాలనమునుండి ఏ ప్రాంత మెప్పుడు జారిపోవునో మరల నే పాలనములోని కే ప్రాంతము వచ్చి కలయు చుండునో యన్న విషయమును గూర్చి వ్యగ్రత నిరర్థకము.  అంతయు కాలము చేతులో నున్న వ్యవహారము.  మానావమానములు కాలము చేతనే కలుగుచున్నవి కాని వ్యక్తుల ప్రయోజకత్వగరిమావిన్యాస మందు శూన్యమని బలి చక్రవర్తి యింద్రునకు చేసిన బోధను స్ఫురణకు దెచ్చుకొన వలయిను సుమా.

నేడు తెలంగాణావారి దృష్టిలో భద్రాద్రీశుడు తెలంగాణపు నవాబుల యేలుబడి కొకప్పుడు లోనై యుండిన కారణము చేత పునర్దాస్యయోగ్యుడై నాడు. శాంతం‌ పాపమ్‌.  తెలంగాణమువారి దృష్టిలో నిది భద్రాద్రిరామచంద్రునకు విడుదల ప్రసాదించి రక్షించుట కావచ్చును కదా.  కానిండు దానికేమి.  కట్టబెట్టువారు కలిగినచో కాశీక్షేత్రంబును తెలంగాణావారిదే కావచ్చును.  శక్తి కలిగినచో కాలబలము గలవార లితరుల యూళ్ళలో నెండయు వెన్నెలయును గూడ కాయరాదని శాసింతురే కదా.  వృధా విచారము మాని యోచించవలయును.  రామాలయమను నొక కట్టడము తెలంగాణములోనికి వచ్చినంత మాత్రము చేత శ్రీరాముడు తెలంగాణవారి కట్టుబానిస కాబోడు కదా యని చక్కగా గ్రహించి తెలంగాణాప్రాంతవాసులు కాని వారును నిర్విచారముగా నుండ వచ్చును.  విజ్ఞులైన వారు కాలగమనంబుచే గలుగు వింతలకు చింతించక జరుగుచున్నది  నిర్వికారులై సాక్షిమాత్రులై గమనించు చుందురు. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః అని గీతాకారుడు చెప్పినట్లుగా నుండుటయే తెలుగువారికి కర్తవ్యము.  ముఖ్యముగా సీమాంధ్రప్రాంతవాసులైన తెలుగువారికి కాలము ప్రసాదించిన కర్తవ్యము.  శుభం భూయాత్.

19, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 21



నా యిళ్ళు పడదోసి నవ్వుచుందువే
నీ యింటికి రమ్మని నిలదీయుదువే
నీ యింటికి దారేదో నీవు తెలుపక
మాయగాడ నేను వచ్చు మాట యున్నదా



18, నవంబర్ 2013, సోమవారం

వంకాయ ప్రశస్తి.

కొత్త వెబ్ పత్రిక   సృజన  ఆవిర్భవించింది.  దానికి సుస్వాగతం.

అందులో లాస్యగారు గుత్తి వంకాయ కూర చేయటం గురించి వ్రాసారు  ఘమఘమలు  అని.
వంట గురించి నేనేం‌ వ్రాయగలను గాని, వంకాయ గురించైతే కొంచెం వ్రాయాలని అనుకుంటున్నాను.

ప్రసిధ్ధ రచయిత్రి, విదుషీమణి స్వర్గీయ  శ్రీమతి మాలతీచందూర్‌గారు బోలెడు మంచి సాహిత్యంతో పాటు, వంటలు-పిండి వంటలు అన్న పుస్తకం కూడా వ్రాసారు.  అదే ఎక్కువగా అమ్ముడు పోయింది అనుకుంటాను, ఆవిడ పుస్తకాల్లో.  అందులో వంకాయను గురించి మాలతమ్మగారు,  ఈ వంకాయను ఒక రోజున వండినట్లు తిరిగి మరొక రోజున వండుకోకుండా నెలకు ముఫై రకాలుగానూ చేసుకోవటానికి వీలున్న కూర అన్నారు.

అంత గొప్ప కూర కాబట్టే దానిమీద ఒక చాటు పద్యం వెలసి బహుప్రచారం‌ పొందింది కూడా.

కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే

అని.

ఈ వంకాయమీద ఎవరూ ఒక దండకం వ్రాసినట్లు కనబడదు.  కాఫీమీద ఒక ప్రచారంలో ఉన్న దండకం ఉంది కాని.

ఐనా వంకాయ పాటలపల్లకీ ఎక్కింది.  బసవరాజు అప్పారావుగారి  ఒక పాటలో

గుత్తి వంకాయ కూరోయి బావా!
కోరీ వండినానోయి బావా!

అని వస్తుంది.  ఈ‌ పాటని స్వర్గీయ బందా కనకలింగేశ్వరరావు గా అద్భుతంగా గానం చేసే వారట. శ్రీబందావారి గురించి   ఇక్కడ చదవండి.

ఆ పాట యొక్క పూర్తి పాఠం  ఇక్కడ  చూడండి.

తెలుగుసామెతల్లోకి కూడా వంకాయ చోటూ చేసుకుంది.  కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ అని ఒక సామెత మరి.  వంకాయ దొంగిలించిన వాడు టెంకాయకు రాడా అని మరొక సామెత. ఇంకా మరేమన్నా వంకాయ సామెతలున్నాయేమో చూడాలి.

తెలుగువారిలో వంకాయల అన్న ఇంటిపేరు  గలవా రున్నారు.  వారిలో వంకాయల సత్యనారాయణ గారని ఒకరు సినిమా నటులు. వారి గురించి ఇక్కడ  చూడండి.

రాజమండ్రిలో వంకాయలవారి వీధి కూడా ఉంది.  ఒక సారి ఏదో బస్సులో వెళుతూ చూసాను!

ఇంత గొప్ప వంకాయలో పోషక విలువలు ఎన్నున్నాయో  ఇక్కడ    చూడండి. నిజానిజాలు నాకూ‌తెలియవు.  పోషకవిలువల మాట అటుంచి, వంకాయ రుచి మరి దేనికి వస్తుంది చెప్పండి?

వంకాయలో రుచీ,పోషకాల మాటలకేం గాని వంకాయ మంచి  ఔషధగుణాలు కలది అన్నది ఋజువైన సత్యం.  ఆసక్తి ఉంటే ఆ వివరాలు  ఇక్కడ చదవండి.

ఏమిటో నండీ వంకాయగురించి తెగ  వివరించేస్తున్నాను.  అతి ఐపోతున్నట్లుంది. ఇంక సెలవు.

అవునా? - 20



ఎన్నెన్నో‌ ఈ సృష్టినిండా ద్వంద్వాలు
అన్నీ సత్యశుధ్ధి యెరుగని అబధ్దాలు
అన్నన్నా ఈ నువ్వూ - నేనూ అన్నది
అన్నిటిలో మొదటి దైన పెద్ద అబధ్ధం



17, నవంబర్ 2013, ఆదివారం

అవునా? - 19



ఇక్కడకు వచ్చిన నేను ఏమి సాధించానో‌ తెలియదు
ఇక్కడకు నే నింకేదైనా సాధించాలని వచ్చానా చెప్పు
ఇక్కడ నువ్వు చెప్పింది చేస్తూపోతే చాలనుకున్నాను
అక్కడికీ ప్రతిపని లోనూ నీ సహాయం తీసుకుంటూనే



16, నవంబర్ 2013, శనివారం

అవునా? - 18



వేల తోలు తిత్తులలో విడిసి అలసినాను
వేల యేండ్లు నీ కోసం వెదకి అలసినాను
నేల నింగి అణువణువున అరసి యలసినాను
మేలగు నిక దొంగాటలు చాలించుట సఖుడ



14, నవంబర్ 2013, గురువారం

అవునా? - 17



ఈ‌ కళ్ళతో ఎంతో గాలించాను
లోకా లన్నింటినీ మరి నీ కోసం
నాకు తెలియలేదే యిన్నాళ్ళూ
నీ కాపురం నా గుండెలోనే నని



13, నవంబర్ 2013, బుధవారం

అవునా? - 16



వెల లేని వెన్నెల ఈ విరబూసిన వెన్నెల
 వెలుగు సూర్యుడిదే కాని కీర్తి చంద్రుడిది
తలపులోన కులుకు భావతటిల్లతవు నీవే
పలుకు నీదే కాని ఆ పేరు తోలు తిత్తిది



12, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 15



 ఆలోచించితే అవగాహనకు వచ్చేవాడివి కావు నీవు
అనంతానంతవాంగ్మయసాగరానికీ అవల ఉన్నావు
అయినా నీ మీద నా కెందుకో ఈ అంతులేని ప్రేమ
బహుశః అది నా హృదయప్రతిస్పందన నీ ప్రేమకు



11, నవంబర్ 2013, సోమవారం

అవునా? - 14



తూలి నేలకు జారిన ఆకు గాలికి చిక్కుతుంది
గాలిలో తిరిగే ఆకుకు ఒక గమ్యం ఏమిటి
 తేలిగ్గా నీ లీలకు మనిషి ప్రకృతికి చిక్కుతాడు
కాలప్రభంజనంలో మనిషికి ఒక గమ్యం ఏమిటి



10, నవంబర్ 2013, ఆదివారం

అవునా? - 13




కొన్ని కొన్నింటిని కొందరే ఇవ్వగలరు
వెన్నెలను పంచటం వేరే వాళ్ళ తరమా
ఎన్నిజన్మలైనా వేచి ఉండవలసిందేగా
మన్నించి నువ్వు మోక్షమిచ్చేదాకా




9, నవంబర్ 2013, శనివారం

అవునా? - 12




ప్రతిరోజూ కలలొస్తాయి
ప్రతికలలో నువ్వొస్తావు
ప్రతిరోజూ రాత్రికోసం
బ్రతకట మొక సంతోషం



8, నవంబర్ 2013, శుక్రవారం

అవునా? - 11




సురసిధ్ధోరగగంధర్వాప్సర
నిరంతరసంకీర్తనారావాలు
త్వరగా రమ్మని పిలిచే యీ
నరుడిఘోష నిను విననిస్తాయా




7, నవంబర్ 2013, గురువారం

రాస్ట్రవిభజన ఆపేందుకే రాయల తెలంగాణా అంటున్నారా?

రాస్ట్రవిభజన ఆపేందుకే రాయల తెలంగాణా అంటున్నారా?

ఇదేమంత ఆశ్చర్యపోవలసిన సంగతి కాదు.

దిగ్విజయసింగ్‌గారు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే ముక్తాయింపుగా, ఇంక కాంగ్రెసులో తెరాస విలీనం అవుతుంది అని ఆశాభావం‌ ప్రకటించి, తెలంగాణా సెంటిమెంటును గౌరవించటం కన్నా ప్రత్యేకరాష్ట్ర ప్రకటన నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని స్పష్టంగానే ప్రకటించారు.

ఐతే, కాంగీపార్టీలో దూరితే సముద్రంలో దూరిన నదిలాగా చిరునామా కూడా మిగలకుందా పోతామని కచరా గారికి బాగా తెలుసు.  అందుకే ఇన్నాళ్ళూ కాంగీని ఆశపెట్టి, తీరా సమయం రాగానే ఓడ దాటాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా, తెరాస విడిగానే ఉంటుందని ఆయనగారు ఢంకా బజాయిస్తున్నారు.

అదీ కాక, తెరాసకు కావలసినది ఉద్యమం కొనసాగటం కాని అది ముగియటం కాదన్న వాదనా బలంగానే వినిపిస్తూ ఉంటుంది తరచుగా.  అందుకే రాష్ట్రం సాకారం కాకుండా ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలతో ఆయన కదనకుతూహలరాగం పాడుతున్నారు.  దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయి తెరాసకు.  ఒకటి, రాష్ట్రం ఏర్పడితే, ఇంకా తమకు కొన్ని ముఖ్యమైన డిమాండ్లు అసంపూర్తిగానే ఉన్నాయనై యాగీ చేసి ఎన్నికలలో హవా తగ్గకుండా చూసుకోవటం.  రెండవది, కాంగీవారు రాహ్ట్రం ఎన్నికలలోగా ఇవ్వకుంటే, వారిని దుమ్మెత్తిపోసి రాష్ట్రాన్ని సాధిస్తాం అంటూ గర్జించి తమ హవాకు ఎదురు లేకుందా చూసుకోవటం.  ఏదైనా తెరాసకు మంచిదే నని కచరాగారి ఆలోచన కావచ్చును.

ఇక కాంగీ ఆలోచనా ధోరణి చూద్దాం.  కచరాగారు, తెరాసను కాంగ్రెసులో విలీనం చేయకుండా విడిగా ఉండి సీట్లన్నీ తన్నుకు పోవాలని చూస్తున్నారు.  అలా అవన్నీ ఆయన పట్టుకు పోవటం కాంగీవారికి సమ్మతం కానే కాదు.  కెసీఅర్‌గారి దూకుడు వల్లనే ఇబ్బందులు వచ్చాయని యాగీ చేసి తామే రాష్ట్రసాధకుల మని చెప్పి ప్రజలను నమ్మించాలని వారి ఆలోచన.  ఇది ఫలించే అవకాశాలూ దండిగానే ఉన్నాయి.  కాబట్టి కెసీఅర్ బూచిని చూపి, ఏవోవో ఇతర కారణాలు చూపీ రాష్ట్రవిభజన విషయంలో కొంత తాత్సారం చేస్తే కచరాగారికి బదులు కాంగీయే లాభపడితే, ఆనక కెసీఅర్‌గారి బ్లాక్‌మెయిల్ అవకాశానికి తప్పకుండా గండి పడుతుంది.  విశ్వసనీయత పోయింది కాంగీలో కచరాగారి మీద.  అందుకే అది, ఆయన ప్రమేయం లేకుండా గెలిచే అవకాశాలు అన్వేషిస్తున్నట్లుంది.  రాష్ట్రవిభజన కాకుండా ఎన్నికలు వచ్చిపడితే ప్రజలు ఇచ్చే దారిలో ఉన్న కాంగీకా,  తెచ్చేహడావుడి చేస్తున్న తెరాసాకా - దేనికి ఓటు వేయాలీ అని తేల్చుకోవాలి మరి.  ఇది కాంగీకి లాభిస్తుం దనుకుంటే కేసీఅర్‌గారు దిగిరాక తప్పదు.  అలాగే, రాష్ట్రవిభజన కష్టం అవుతుందీ, అది ఎలాగూ జరగదూ అన్న భ్రమలు సీమాంధ్రకు కలిగించటమూ పిల్లకాంగ్రెసుకు హెచ్చుగా లాభిస్తుంది - అంటే అంతిమంగా కాంగీకే లాభం అన్నమాట.

అందుచేత ఈ రాజకీయ డ్రామాను అర్థం చేసుకుంటే ఎవరికీ తికమక ఏమీ‌ ఉండదు.
అంతా పక్కాగా ప్లాను ప్రకారమే జరుగుతోందనేది స్పష్టం.

ఎవరు లాభపడతారూ ఎవరు నష్టపోతారూ అన్న ప్రశ్నలు పక్కన పెట్టండి.
రాజకీయ అనిశ్చితి వల్ల ప్రజలు మాత్రం భారీగా నష్టపోతారు.

అవునా? - 10




ఆకాశానికి ఆవల ఉన్నా
అవ్యక్తానికి ఆవల ఉన్నా
నీ కై వేచిన నిజభక్తుడనే
నా కోసం రావచ్చునుగా




6, నవంబర్ 2013, బుధవారం

అవునా? - 9




నీ వేగులే ఈ సూర్యచంద్రులు
నీ వేగులే ఈ పంచభూతాలు
కావాలా ఇంత కాపలా నామీద
నీ వాడిని నేను నా వాడివి నీవు




5, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 8




నువ్వు గొప్పవాడివనీ నమ్ముతున్నాను
నువ్వు మాయగాడివనీ నమ్ముతున్నాను
నువ్వు మంచివాడివనీ నమ్ముతున్నాను
నన్ను కూడ కాస్త నమ్మమంటున్నాను




4, నవంబర్ 2013, సోమవారం

అవునా? - 7




ఆ వసంతం ఒక్కటీ సరిపోయేది కాదా
ఈ‌ వేసవినీ చలికాలాన్నీ ఇవ్వటం దేనికి
నీవూ నేనూ ఉంటే సరిపోయేది సృష్టిలో
ఈ వెర్రిమొర్రి సరంజామా ఇక్కడ దేనికి




3, నవంబర్ 2013, ఆదివారం

అవునా? - 6




నీకు తెలియకుండా ఏమి జరుగుతోంది
నాకు తెలిసి ఇక్కడ ఏమి జరుగుతోంది
జరిగేదంతా జరిపించేది నీవే ఐనా
జరుగున్న ప్రతిదానికీ కర్తను నేనా




2, నవంబర్ 2013, శనివారం

అవునా ? - 5




నీవో అనంతకాలప్రవాహానివి
నేనా మహాప్రవాహపు కెరటాన్ని
నీ వెలా ఉండగలవు నన్ను విడిచి
నే నెలా ఉండగలను నిన్ను విడిచి




1, నవంబర్ 2013, శుక్రవారం

ఏమి నీతిమంతుడ వయ్య


  

ఏమి నీతిమంతుడ వయ్య యిటు నను విడిచేవు
తామసంపు బుధ్ధుల మధ్య దయమాలి నీవు



అడిగిన వారి కెల్ల నప్పు డభయ మిచ్చినావు  
పుడమి నిండె నీదు కీర్తి పున్నమిశశి వెలుగై
నడుమ నేమి వచ్చె నయ్య  నాకిట్లు చేయగ
బడలి యున్నావో రామభధ్ర నీవు నేడు  
॥ఏమి॥


అప్పుడెప్పుడో రేగి యసురుల జంపినావు
గొప్పగా నీ యవని మీద కొలువు దీరి నావు
ఇప్పు డసురు లగుచు నరు లెగురుచున్న జుచి
చప్పున దండించ రావు జానకీశ నేడు
॥ఏమి॥


నిన్ను నమ్ముకొన్న వారి వెన్నంటి యుండక
యెన్నడు లే నట్టి రీతి నింత కరుణమాని
యున్నా వే మయ్య  వేచి యున్నాను నీవే
చిన్నచూపు చూచిన నేమి చెప్పవచ్చు రామ
॥ఏమి॥

అవునా? - 4




ఇక్కడకు నన్ను పంపావు
ఒక్కమాట చెప్పావుకావు
అక్కడ నువ్వు కూర్చున్నావు
ఒక్కమాట వినిపించుకోవు




31, అక్టోబర్ 2013, గురువారం

విజ్ఞప్తి



ఇది ప్రజాస్వామ్యదేశమౌ నెడల ప్రజల
అభిమతమ్ములె రాజకీయములు చేయు
వారలకు దారిచూపించ వలయు గాని
తద్విలోమంబు నాశించ తగదు నిజము

తమతమ ప్రాంతము లందును
తమమాటకు విలువలేని  ధర్మప్రభువులున్
తమబుధ్ధికి తోచిన య
ట్లమరించగ నాంధ్రజాతి యది యెట్లొప్ప్పున్

ఏండ్ల తరబడి చర్చించి యెట్లు చేయ
నైన ధైర్యంబు చాలని యట్టి కేంద్ర
మిపుడు త్వరపడుచున్నదే యిందు రాజ
కీయలాభాక్షయొకటె మిక్కిలిగ దోచు


ఆరిపోయెడు దీపమైనట్టి కాంగి
రేసు పార్టీకి యుసురులు తీసివేయ
రేపు రానున్న ఎన్నిక లేపగిదిని
దాటరాకున్న భయమున తత్తరపడి


అల్పసత్వులు నాయకు లందరచట
ఈ చిరంజీవితో కార్యమింత లేదు
ఎవరు తెలుగుదేశంబున కెదురు నిలచి
సీట్లు సాధింతురన్నట్టి చింత కలిగి


ఆ యాంధ్రయె కీలకమౌ
ఆ యెడలను దెబ్బతినుట ఆత్మహననమౌ
న్యాయంబుగ గెలువని చో
న్యాయంబును విడిచి గెలువ నగునను బుధ్ధిన్


అటు తెలంగాణాలో కేసియారు గలడు
ఇటు సీమాంధ్ర జగనన్న గుటక వేయు
రాష్ట్రవిభజన మేలిర్వురకును పిదప
కాంగిరేసులో జేరిపో గలరు వారు

తనకు తెలగాణలోన పెత్తనము నిచ్చి
గారవించిన సోనియా కోరినట్లు
గా తెరాసాను కాంగిలో కలుపగలడు

కేసియారను నట్టి పేరాసయొకటి

నెత్తిపై నున్న కేసుల నెత్తివేసి
బయట పడవేసి సీమాంధ్రపట్ట మిచ్చి
ఆదరించిన జగనన్న మోద మలర
మనకు లోబడ గలడను మాట యొకటి

చాల బలమున్న తెలుగుదేశంబు నొక్క
ప్రాంతమున గింజుకొన చేయ వచ్చు ననుట
రాష్ట్రవిభజనతో గల్గు రమ్యమైన
లాభ మగునని తోపించు లోభమొకటి

కలిసి తెలుగిల్లు రెండుముక్కలుగ జేయ
తొందరించగ కాంగ్రేసు తొండియాడె
ఇన్ని నాళులు మనసులో‌నున్నమాట
బయటపెట్టని కాంగ్రేసు బయటపడెను

రాష్ట్రవిభజన చేయ నారాట పడెడు
సోనియాగాంధిపై భక్తి చూపువారు
మన తెలంగాణవాదులు మంచి వారు
కాంగిరేసు కపటమును కాన లేరు

సకలసీమాంధ్రజనులును శాంతిపరులు
కాంగిరేసు కపటమున కటకటబడి
రాష్ట్రవిభజన చేయ నారాట పడెడు
సోనియమ్మను చెడతిట్ట బూని నారు

ఏది ఎటుల నైన నీ దేశ మే మైన
ఎవరి కెగ్గు లగ్గు లెటుల నైన
కాంగిరేసు సీట్ల కాసించి దొంగెత్తు
వేయు చుండె గాని వేరు కాదు

సోనియమ్మకొడుకు శూన్యప్రజ్ఞాశాలి
రాహులయ్యగారు రాజ్యమేల
దారి చేయనెంచి తప్పుడు దారిని
పట్టె కాంగిరేసువారి బుధ్ధి

అన్నన్నా యీ‌కుట్రలు
పన్నుట దేశాధిపత్యభాగ్యంబునకా
చిన్నయ్యను తెచ్చుటకే
యన్నది పసివారికైన నవగత మగునే

ఇంత చిన్నవిషయ మెరుగ లే కున్నారె
ఎరిగి కూడ స్వార్ధపరుల యుచ్చు
లోన చిక్కి రాష్ట్రలోభంబు దలపోసి
సంతసింతు రయ్య కొంతమంది

అరువదేండ్లనుండి యన్నిప్రభుత్వంబు
లితర నగరములను వెతల బెట్టి
యకట మేపినారు హైదరాబాదును
దాని కొరకు నేడు తగని గొడవ

మీరు దొంగలన్న మీరేను దొంగలు
నాగ తిట్టుకొనుట సాగుచుండె
నెల్లచోట్ల దీన నేమి సాధింతుము

తెలుగువారి పరువు మలగు గాక

రాజకీయలబ్ధి రాలునో రాలదో
రేపుమాపు కాంగిరేసు గెలిచి
రాహులయ్య నొసట రాజ్యమున్నదొ లేదొ
ముందు తెలుగు గడ్డ ముక్కలగును

విరిగిన మనసుల నతుకుట
మరియా బ్రహ్మకును సాధ్యమగునా ఒక తుం
టరి వాని హీన లాభము
కొరకై మనలోన మనము కొట్లాడుటయా

ఈ తెలుగుజాతి మున్ముం
దే తీరున నుండగలదొ తెలియదు లోలో
నీ తీరగు కలహంబుల
చైతన్యవిహీనమైన చదికిల బడెడున్

కలసియుండిన సౌఖ్యంబు కలదు కాని
చెడుదురన్యోన్నద్వేషంబు చేత ప్రజలు
నలుగురును చేరి చర్చించి నయము మీర
అందరకు మంచి యగు దారి నరయ వలయు

రాజకీయులకిక లొంగ రాదు ప్రజలు
దేశమునకేది హితమౌనొ తెలిసి కలిసి
ఎల్లవారును మెలగుట యెల్ల వేళ
లందు మే లొనగూర్చునో యన్నలార

మృత్యుశకటాలు!

(ఫోటో ఈ‌నాడు సౌజన్యంతో)




అప్పుడొక బస్సు కూలి ముప్ఫైమంది
ఇప్పుడొక బస్సు కాలి నలభైమంది
తప్పించుకొనలేనివీ మృత్యుశకటాలు
అప్పటికప్పుడు నేతల దిగ్భ్రాంతులు
అప్పటికప్పుడు  చకచకా చెక్కింగులు
తప్పుడు ప్రజాస్వామ్యపాలనా చిత్రాలు
తప్పులు దిద్దుకోలేని పాలనావ్యవస్థలు
ఎప్పటికి మారేనో యీ జనం తలరాతలు

అవునా? - 3




నీ సృష్టి ఎందుకు జరిగేదీ నీ యిష్టం
నేను వద్దన్నా ఆపవు కదా
నీ చుట్టూ ఎందుకు తిరిగేదీ నా యిష్టం
నువ్వు వద్దన్నా ఆగను కదా




30, అక్టోబర్ 2013, బుధవారం

అవునా? - 2




ముక్తి కావాలి నాకు
భక్తి కావాలి నీకు
రద్దు కానీ‌ భేషజాలు
ఇద్దరం బిచ్చగాళ్ళమే






29, అక్టోబర్ 2013, మంగళవారం

అవునా?



నేను నా కోసం‌ బ్రతుకుతున్నంత కాలమూ
నీకు చిరాకుగా ఉండేదని విన్నాను
నేను నీ కోసం తపించటం‌ మొదలు పెట్టాక
నీకు పరాకుగా ఉందని తెలుసుకున్నాను




నాన్నగారి పర్యవేక్షణ వలన బతికిపోయాం

మా పాఠశాలకోటా మార్కుల మీద నాన్నగారి పర్యవేక్షణ గురించి వ్రాస్తూ, ఈ మార్కుల విషయంలో కక్షసాధింపుకు నేనూ, నా స్నేహితుడు కన్నబాబూ దాదాపుగా బలి ఐన సంఘటనను ప్రస్తావించాను కదా.  వివరాలు ఇప్పుడు చెబుతాను.

ఈ కన్నబాబు అనే ముద్దుపేరుగల పిల్లవాడి పేరు కందుకూరి వీర వేంకట సత్యనారాయణ.  మా ఇద్దరిదీ మంచి స్నేహం.  ఇద్దరం కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళం తరచుగా వాళ్ళింటి ఔట్‌హౌస్‌లో కూర్చుని.  మాయిద్దరి మైత్రి వెనుక మా తండ్రిగార్ల మైత్రీ బంధం ఉంది మరి.  కన్నబాబు తండ్రి భాస్కరంగారు మా నాన్నగారికి క్లాస్‌మేట్.  భాస్కరంగారు స్టేట్ బ్యాంక్‌లో పనిచేసేవారు.  చాలా మంచి మనిషి మరియు చాలా చాలా  ఖచ్చితంగా వ్యవహరించే మనిషి కూడా.  కాబట్టే ఆయన్ను దూరంగా తనకల్లు బదిలి చేసారని  కొందరు అనేవారు.  అక్కడాయన చాలా కాలం పని చేసారు.   ప్రతివారం కొత్తపేట వచ్చి వెళ్ళేవారు.  కన్నబాబు కూడా స్టేట్ బ్యాంక్ లోనే మంచి పొజిషన్‌లొ రిటైర్ అయ్యాడు ఈ‌ మధ్యనే.  వాళ్ళు హైదరాబాదులోనే ఉంటారు.  మా నాన్నగారి తరం నుండి మాతరం వరకూ మా రెండు కుటుంబాలకూ మంచి మైత్రి ఉంది.   మా కన్నబాబు నా కన్నా చురుకైన విద్యార్థి.  భాస్కరంగారు ప్రతిసంవత్సరమూ కార్తీకపౌర్నమికి లక్షబిల్వార్చన చేసేవారు స్థానిక శివాలయంలో.  ఆయన దయతో నాకూ కొన్ని సార్లు అ బిల్వార్చనలో పాల్గొనే అదృష్టం కలిగింది.   బిల్వార్చన తరువాత వారింట్లో రాత్రి చాలా వైభవంగా సమారాధన జరిగేది.

చిన్నతనం చిన్నతనమే. అమాయకంగా పిల్లలు చేసే పనులు ఒక్కొక్క సారి పెద్దలకు తలవంపులు తెస్తాయి. ఒక్కొక్కసారి అవి పెద్దవాళ్ళ తప్పుల్నీ‌ బయట పెడతాయి.

రావుగారని సోషల్ స్టడీస్ టీచరు.  ఆయన పూర్తిపేరు నాకు గుర్తు ఉంది.  కాని అది ప్రస్తావించాలని అనుకోవటం లేదు.   ఆయన మాకు తొమ్మిదో తరగతిలో అనుకుంటాను పాఠాలు చెప్పేవారు.  ఆయన  మేప్ డ్రాయింగ్ కోసం పుస్తకం‌ డిజైన్ చేసి, వాటి కాపీలు పిల్లలందరికీ ఇవ్వమని మా క్లాసులీడరు బండ్లమూడి నాగేశ్వరరావుగారికి ఇచ్చారు.  ఒక్కో పుస్తకం ఖరీదు మూడు రూపాయలు.

బండ్లమూడి నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు. చాలా సౌమ్యంగా మాట్లాడేవాడు.  అందరికీ తలలో నాలుకలా ఉండే వాడు. అతడి తమ్ముడూ మా తమ్ముడూ క్లాస్‌మేట్లు.  తరవాతి కాలంలో ఒక విచిత్రమైన విషయం తెలిసి ఆశ్చర్య పోయాం.  నాగేశ్వరరావు తమ్ముడికి కమ్మఫీలింగ్ అని ఒక భావన ఉండేదట.  అంటే కమ్మవారైన తాము కమ్మవారితో తప్ప  స్నేహంగా ఉండటం అనవసరం అన్న భావన అన్నమాట.  నిజమో అబధ్దమో నాకు తెలియదు.  ఒకటి రెండు సార్లు ఆ అబ్బాయితో నేను మాట్లాడినప్పుడు అలాంటి ధోరణి ఏమీ కనిపించలేదు మరి.  వట్టి అనుమానమే కావచ్చును.  ఐతే, ఇలాంటి కమ్మఫీలింగ్ అనే అమాయకపు భావన ఒకటి నిజంగానే కొందరిలో ఉండేది ఆ రోజుల్లో

మళ్ళీ విషయంలోకి వద్దాం.  నాకూ‌ కన్నబాబుకూ ఒక కోతి అలోచన వచ్చింది.  అంత ఖరీదు ఎందుకు  పెట్టటం?  ఆ పుస్తకం ఏదో మనమే కుట్టుకోవచ్చును కదా అని.  ఊళ్ళోనే గౌరీశంకర్ బైండిగ్ వర్క్స్ అనే చిన్న షాపులో చక్కగా అవే మేప్‌లు దొరికాయి.  అదే రకమూ, రంగూ కల కార్డుబోర్డు అట్ట కూడా ఆ బైండింగ్ షాప్ ఎదురుగా ఉండే నాగా అండ్ కో షాపులో దొరకనే దొరికింది సులువుగా.  ఇంకేం‌ కావాలీ?

 మేమూ, మేప్ డ్రాయింగ్ పుస్తకాలు సిధ్ధం చేసుకున్నాం. సోషల్ మేష్టారికి లెక్కకి మేప్ డ్రాయింగ్ పుస్తకాలు సరిపోయాయి అందరూ‌ తీసుకున్నట్లుగా.  కాని బండ్లమూడి ఇచ్చిన పద్దు ప్రకారం ఇంకా ఇద్దరు కొనాలి.  ఎవరూ ఆ కొనని వాళ్ళూ  అనగానే మా పేర్లు సులువుగానే  బయటికి వచ్చాయి.  అంతవరకూ ఒక ఎత్తు.  ఆ పైన జరిగినది మరొక ఎత్తు!

"ఏమిట్రా ఇది?" అని రావుగారు నిలదీసారు మమ్మల్ని.

"మేమే కుట్టుకున్నా మండి"

"ఒక్కో పుస్తకానికి ముప్పావలా మాత్రమే ఐందండీ"

ఈ  మా జవాబులతో పాపం  మాష్టారికి అవమానం జరిగిపోయింది కదా!
నిజానికి ఇలా చేయటం ఆయనకు తలవంపుల వ్యవహారం అవుతుందన్న ఇంగితం మాకు లేనే లేదు!

విషయం మా నాన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళారు మాష్టారు.
ఎలాగో, ప్రధానోపాధ్యాయులు రమణయ్య పంతులుగారి దృష్టికీ వెళ్ళింది వ్యవహారం.
నన్నూ కన్నబాబునీ పిలిచి మా నాన్నగారి సమక్షంలో పంతులుగారు పంచాయితీ పెట్టారు.
భాస్కరంగార్నీ పిలిపించేవారేమో కాని ఆయన తనకల్లులో ఉన్నారనుకుంటా.

పంచాయితీ అంటే,  మా యిద్దర్నీ పిలిచి, జరిగిన సంగతి అంతా పంతులుగారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తరువాత  "సరే,క్లాసులోకి పోండి" అని పంపేసారు. అంతే.

ఎవరూ  మా యిద్దర్నీ ఏమీ అనలేదు!
రావుగారు కాని పంతులుగారు కాని మమ్మల్ని  మరేమీ అనలేదు.
ఎవరూ మమ్మల్ని శిక్షించలేదు.
కాని మిగతా పిల్లలందరికీ తలొక రెండు రూపాయల పావలా చొప్పునా  రావుగారు బండ్లమూడి ద్వారా సొమ్ము వాపసు ఇచ్చేసారు.  అలా ఇచ్చేయమని పంతులుగారి ఆర్డరని తరువాత చాలా కాలానికి తెలిసింది.

ఈ‌సంఘటనతో, మా నాన్నగారు మాత్రం చాలా అసౌకర్యానికి లోనయ్యారు.  అయన నన్ను బాగా చీవాట్లు వేసారు.  పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీచర్లతో పోట్లాటకు దిగకూడదని హెచ్చరించారు.

అనంతరకాలంలో ఆనాటి పంచాయితీ విషయం నాన్నగారు నాతో ప్రస్తావిస్తూ, పంతులుగారు "టీచర్లు పాఠశాలలో వ్యాపారకార్యక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని" హెచ్చరించారని చెప్పారు.  రావుగారు నామీద కడుపులో కక్షపెట్టుకుంటారేమో నని నాన్నగారు సందేహించారట.  ఆయన ముందు ముందు కాలంలో నాకు క్లాసు టీచరుగా రావచ్చును కదా మరి.  అదీ కాక నాకూ కన్నబాబుకూ కూడా మిగతా మాష్టర్ల దృష్టిలో చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం.

అనుకున్నట్లే రావుగారు నాకు పాఠశాల విద్య చివరి రెండేళ్ళూ సోషల్ స్టడీస్ చెప్పారు. ఆయన నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దుతారనీ, ట్యూషన్ పిల్లలకి మాత్రమే మంచి మార్కులు వేస్తారనీ విద్యార్థిలోకంలో ఒక అభిప్రాయం గట్టిగా వ్యాప్తిలో ఉండేది.  అందుచేత పిల్లలు ఆయనంటే బాగా భయపడేవారు.

పదకొండవతరగతిలో ఆయనకూ నాకూ మళ్ళీ  ముఖాముఖీ తగాదా వచ్చింది. అదీ ఉత్త పుణ్యానికి!

హాఫ్ ఇయర్లీలో అనుకుంటాను, మహ్మద్ బిన్ తుగ్లక్  పరిపాలనను గురించిన ప్రశ్నకు సవిస్తరంగా జవాబు వ్రాస్తూ, అతను తోలు నాణాలూ ముద్రించి చెలామణీ చేసాడని వ్రాసాను.  అ మాట మా టెక్స్ట్ పుస్తకంలో లేని విషయం.  అందుచేత రావుగారు ఎర్రసిరాతో అండర్‌లైన్ చేసి ఆక్షేపించారు. ఆ ప్రశ్నకు నాకు బొటాబొటీ మార్కులు వేసారు.  నేను ప్రశ్నించే స్వభావం‌ ఉన్నవాడిని కాబట్టి నిలబడి అడిగాను. 

ఆయనకు ఆగ్రహం వచ్చి, నా సమాధానాన్ని చదివి క్లాసులో వినిపించి, "వాడు తోలు నాణాలు వేసాడట్రా, వీడు కనిపెట్టాడు" అని ఎద్దేవా చేసారు. ఈ మాట కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారి మహమ్మదీయ మహాయుగం అనే పుస్తకంలో ఉందనీ, అది చదివి నేను జవాబులో వ్రాసాననీ అంటే ఆయన నన్ను ఛాలెంజ్ చేసారు.   మరునాడు నేను ఇంటి నుండి ఆ పుస్తకం తీసుకు వెళ్ళి ఆయనకు చూపించాను.  అయనేమీ సంతోషించలేదు.  మధ్యలో ఈ‌ లక్ష్మణరావెవడూ? పాఠ్యపుస్తకంలో ఉన్నది మాత్రమే  వ్రాయాలి అని తీర్పు చెప్పారు.

అక్కడితో ఆగక , ఆయన ఆ రోజు నుండి నన్ను "తుగ్లక్" అని పిలవటం మొదలు పెట్టారు!  ఆ నిక్‌నేమ్‌  కొంత పాప్యులర్ అయింది కూడా.  చివరికి కొంతమంది స్నేహితులూ సరదాగా అలా పిలిచేవారు నన్ను!  ఇది నాకు చాలా మనస్తాపం కలిగించింది కాని నేను ఎవరికీ చెప్పలేదు.  నాన్నగారికీ  ఎన్నడూ చెప్పలేదు. ఎలా చెప్పాలో తెలియలేదు.

నా స్కూలు చదువు ముగిసి కాలేజీలో చేరాక, నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగా కాబోలు నాన్నగారు ఒకరోజున ఈ విషయం నాకు చెప్పారు.  గురువులతో తగాదాలు పెట్టుకోవటం ప్రమాదకరం అని చెప్పటానికి ఈ విషయం ప్రస్తావించారేమో.  బహుశః కాలేజీలో అధ్యాపకులతో నా సంబంధాలు ఎలాగుంటున్నాయో అని ఆయన ఆందోళన కావచ్చును. ఆ సంభాషణలోనే కన్నబాబుకు కూడా సోషల్‌లో స్కూలు తరపున చిన్నమార్కులే వచ్చిన విషయమూ తెలియ వచ్చింది.

పన్నెండో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పాఠశాలవారి కోటాలో మా ఇద్దరికీ సోషల్ స్టడీస్‌లో వచ్చిన మార్కులు ఒకట్లస్థానంలోనే ఉన్నాయట.  సహజంగానే ఇది స్క్రూటినీ చేసే ఉపాధ్యాయుల ఉపసంఘం దృష్టికి వచ్చింది.  మా ఇద్దరికే కాదు, మరికొందరికీ ఈ సబ్జెక్టులో తక్కువ మార్కులు పడటంతో మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది.  మాకైతే చాలా అన్యాయంగా పడ్దాయి మార్కులు.  అప్పుడు అందరి పేపర్లనీ క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా తమాషా బయటకు వచ్చిందట.  ఓపిగ్గా అంతా  సరిచేసారట.

మా నాన్నగారు నాకూ ఉపాధ్యాయులకూ‌మధ్యన ఉండే సంబంధాల గురించి అంతగా ఆందోళన పడటానికి మరొక చిన్న కారణం ఉంది. నేను ఎనిమిదిలో ఉండగా ఒక రోజున  ఒక ఆరోపణ వచ్చింది నామీద. ఎవరన్నారో, ఎందుకన్నారో తెలియదు. రమణయ్య పంతులుగారిని నేను దూషించి మాట్లాడానని!  మా నాన్నగారు తీవ్రంగా అందోళన చెందారు.  వదలకుండా అ రాత్రి  ఎనిమిది గంటలకు నన్ను వెంట బెట్టుకొని పట్టీ మేష్టారి వద్దకు వెళ్ళారు.  ఆయన ఒక సెకండరీ‌గ్రేడ్ తెలుగు పంతులుగారు పాఠశాలలో.  ఎప్పుడూ‌పట్టీ వేస్తూ ఉండేవారు.  అందుకే ఆయనకా పేరు.  అయనద్వారా నాన్నగారికి యీ వార్త వచ్చిందట మరి.  ఆయన దగ్గరకు పోయి విచారిస్తే, తనకు మరెవరో ఫలానివారు చెప్పారని నీళ్ళు నమిలారు.  నాన్నగారు వదలకుండా తాడంతా లాగి విచారిస్తే అసలు అంతా గాలివార్త అని తేలింది.  ఇలాంటి వార్తలు పుట్టించే వాళ్ళకు పనిలేదేమో.  ఐతే అప్పటి నుండి నాన్నగారు నా యోగక్షేమాలు వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు.  ఐనా ఒకటి రెండు తగవులు వచ్చి పడనే పడ్డాయి చూసారా?  అందుకు ఆయనకు కొంచెం ఆందోళన అనుకుంటాను.

ఈ కాసిని విషయాలూ పక్కన పెడితే, నా కొత్తపేట చదువు చాలా మంచి స్నేహాలూ, మంచి జ్ఞాపకాలతోనే ముగిసింది.

28, అక్టోబర్ 2013, సోమవారం

పాఠశాలకోటా మార్కులమీద నాన్నగారి పర్యవేక్షణ.

నాకు  నాన్నగారి దయవల్ల గడచిన హిందీగండం గురించి ముందే వ్రాసాను కదా.  ఆ టపాలోనే మాకు పబ్లిక్ పరీక్షల్లో 75మార్కులకి పేపర్లూ, స్కూలువారి చేతిలో మిగతా 25మార్కుల వాటా ఉండేదనీ కూడా వ్రాసాను. ఆ 25 మార్కులనీ పాఠశాలవారు లెక్కవేయటానికి ఒక పధ్ధతి ఉంది. మాకు  11 మరియు 12వ తరగతులు రెండేళ్ల కోర్సుమీదా నిర్ధాక్షిణ్యంగా  పబ్లిక్ పరీక్షలు ఉండేవి. ఆ రెండు సంవత్సరాలలోనూ విద్యార్ధి  పాఠశాలవారి పరీక్షల్లో సంపాదించుకొన్న మార్కుల ఆధారంగా కొలిచి 25కి ఎన్ని ఇవ్వాలో నిర్థారించేవారు.

నిర్దాక్షిణ్యం అని ఎందుకన్నానో చెప్పాలి కదా.  లెక్కల పేపరూ, సైన్సు పేపర్లు రెండింటిలోనూ సరిగ్గా పది అంటే పది ప్రశ్నలు ఇచ్చే వారు. ప్రతిప్రశ్నకూ‌ మార్కులు సమానము. 10 x 10 = 100 అని నిర్మొగమాటంగా ప్రశ్నపత్రం మీదే వ్రాసేవారు. ఒక్క ప్రశ్న తప్పిపోయినా పది మార్కులు గోవిందా. పేపర్లు వంద మార్కులకు ఇచ్చి 75మార్కులకు త్రైరాశికం చేసేవారన్న మాట. కొన్ని కొన్ని ప్రశ్నలు రెండు పార్టులుగా ఉండేవి. అచ్చుపుస్తకాల్లోని  అధ్యాయాల్లోని ప్రశ్నల్లోంచి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా ఇవ్వని సందర్భాలూ సాధారణం. పైగా రెండేళ్ళ కోర్సు మీద పరీక్ష కాబట్టి తట్టెడు సిలబస్ తిరగేసుకోవాలి విద్యార్ధులు. పిల్లల్ని ఎలా ఫెయిల్ చేయాలా అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఇచ్చినట్లుండేవి ప్రశ్నాపత్రాలు!

మా బేచ్ వాళ్ళకి ఐతే పగవాడికీ రాకూడని ఒక కష్టం కూడా వచ్చి పడింది.  ఇంగ్లీషు మీడియం కోసం అని  విద్యార్థుల్లోంచి మెరికల్లాంటి వాళ్ళని ఏరి ఒక సెక్షన్ చేసారు.  ఐతే జిల్లాపరిషత్ విద్యాశాఖ వారి నుండి అనుమతి రాలేదు. సరేలే అని మాకు తెలుగులోనే బోధన చేసారు.   ఇంక పబ్లిక్ పరీక్షలు మూడు నెలలు ఉన్నాయనగా, ఆ మహా గొప్ప పర్మిషన్ కాస్తా మా పాఠశాల మీదికి విసిరేసారు.  ఇదేం అన్యాయం అని పోయి మొత్తుకున్నా స్కూలు వారి మాట చెల్లలేదు.  అప్పటి కప్పుడు మాకు స్పెషల్ కోచింగ్ మొదలు. అప్పటికప్పుడు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు కొనుక్కున్నాం.  మొదట్లో జుట్లు పీక్కున్నా వాటిలో పాఠాలు సరిగా అర్థం కాక చాలా అవస్థపడి పోయాం.  ఎలాగోలా అంతా బండి లాగించేసాం కాని, మొదటినుండి ఇంగ్లీషు మీడియంలో చదివించి ఉంటే మాకు మరిన్ని మంచి మార్కులు వచ్చేవి కదా!

మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉడతల రమణయ్య పంతులుగారు చాలా మంచివారు.  అలాగే ఆయన చాలా నిక్కచ్చి మనిషి కూడా. ఆయన పుత్రరత్నాల్లో చిన్నవాడు వేణుగోపాలరావు మా సహవిద్యార్ధి కూడా.  అతని తమాషా ఒకటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం.

మేము పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు రమణయ్య పంతులుగారే లెక్కలు చెప్పేవారు. ఐతే, ఆయనకు పాఠశాల అడ్మినిష్ట్రేషన్ వ్యవహారాలలో మాకు పీరియడ్‌లు తీసుకోవటం తరచుగా కుదిరేది కాదు. అలాంటప్పుడు వేరే మాష్టారుగారు వచ్చి ఆయన క్లాసులు కవర్ చేసేవారు.  పంతులుగారు మాత్రం కుదిరినప్పుడు వచ్చి చాలా బాగా పాఠాలు చెప్పేవారు. ఒకసారి ఆయన మాకు నిర్వహించిన తరగతి పరీక్షల్లో అందరికీ పాతికకూ పాతికమార్కులూ వచ్చాయి. ఎక్కడో తమషా జరిగిందని ఆయనకు అర్థమయింది. ఐనా పిల్లల్ని ఏమీ అనలేదు.  మీరంతా హఠాత్తుగా జీనియస్‌లు ఐపోయారే అని మాత్రం అన్నారు. కాని ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించారు. ఈ సందర్భంలో,  మా నాన్నగారు నన్ను వాకబు చేసారు. అసలేం జరిగిందీ‌ అని.  పంతులుగారి అబ్బాయి వేణూ  లెక్కలపేపర్ని లీక్ చేసాడనీ అందరికీ అందుకే పూర్తి మార్కులు వచ్చాయనీ నిజం చెప్పాను. అసలు సంగతి విని ఆయన బాధపడ్డారు. ఇలాంటివి జరగకూడదు. నీకు  తెలిసిన వెంటనే నాకెందు చెప్పలేదూ‌ అని కోప్పడ్డారు.  చిన్నతనం.  పేపరు దొరికిపోయిందన్న ఆనందంలో అది తప్పు అన్న స్పృహ రాలేదు.  పంతులుగారు కూడా వేణూని దండించలేదు.  అలా చేయకూడదు తప్పు అని మాత్రం అన్నారట.

రమణయ్య పంతులుగారికి, పిల్లలకి రావలసిన పాతికమార్కుల కోటాలో వాటాలు సరిగా ఉపాధ్యాయులు కొలిచి ఇస్తున్నారా అన్న అనుమానం ఉండేది.  అనుమానం ఉన్నా లేకున్నా, ఆ విషయంలో పాఠశాల పెద్దగా పర్యవేక్షణ చేసే బాధ్యత ఆయన మీద ఉంది కదా. డిఇవో ఇన్‌స్పెక్షన్‌లో ఇలాంటివీ పరిశీలిస్తారు మరి. అందుచేత ఈ స్కూలు తాలుకు మార్కులు పిల్లలకు సరిగా వేస్తున్నారా లేదా క్లాస్‌టీచర్లు అన్నది, పంతులుగారు జాగ్రత్తగా గమనించేవారు.

ఆ పాఠశాలలో మా నాన్నగారు ఒక సీనియర్  బిఇడి ఉపాధ్యాయులు.  అప్పటికే ఆయనకు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా చేసిన మంచి అనుభవం కూడా బాగా ఉంది.  మంచి బోధకులుగానే కాక, మంచి నిర్వాహకులుగా కూడా నాన్నగారికి జిల్లాస్థాయిలో చాలా పేరుండేది కూడా.  అందు చేత  ఈ‌ పాతిక మార్కుల కోటాను పర్యవేక్షించే బాధ్యతను పంతులుగారు మా నాన్నగారి మీద పెట్టేవారు.  ఆయనొక్కరే కాదు మరొక రిద్దరూ ఈ పనిలో నాన్నగారితో కలిసి పనిచేసేవారు.

ఈ మార్కుల కొలతల్లో  చాలా తమాషాలు జరుగుతూ ఉండేవని నాన్నగారు ఆ రోజుల్లోనే నా దగ్గర  కొన్ని సార్లు అసంతృప్తి వెలిబుచ్చేవారు.  కొన్ని కొన్ని  ఔదార్యాలూ, తరచుగా కక్షసాధింపులూ కనిపిస్తూ ఉండేవట.  అలాంటి కక్షసాధింపుకు నేనూ, నా స్నేహితుడు కన్నబాబూ  దాదాపుగా బలి ఐన సంఘటన కూడా జరిగింది.  ఈ‌ తమాషానీ నాన్నగారే పట్టుకున్నారు. అది తరువాత చెబుతాను.

కొంత మంది ఉపాధ్యాయులు పిల్లలమీద దయకొద్దీ హెచ్చు మార్కులు వేసేవారు ఈ కోటాలో. ఒక ఉదాహరణ చెబుతాను.

మేము 12వ తరగతిలో ఉండగా జరిగిన సంగతి.  హిందీ‌ పాఠం చెబుతున్నారు పుప్పాల వేంకట్రావు గారు.  మా వయసువాడే ఒక పిల్లాడు వచ్చి గుమ్మంలో నుంచున్నాడు.  మాష్టారు వాణ్ణి లోపలికి రారా అన్నారు.  వాడు వచ్చి ఒక చీటీ‌ ఇచ్చి మాష్టారి ముఖంలోకి ఆదుర్దాగా చూస్తూ ఉన్నాడు.  వేంకట్రావుగారు ఆ చీటీ చదువుకొని, "సరే, నువ్వెళ్ళు.  నేను హెడ్మాష్టరుగారితో మాట్లాడతానులే" అని చెప్పి, వాడిని పంపేసారు.  ఆ కుర్రాడు వెళ్ళిపోయాక మేష్టారు మాతో అన్న మాటలు ఇంకా చక్కగా గుర్తున్నాయి.

"ఒరే, ఈ‌ దిక్కుమాలిన హిందీ అందరికీ  బాగా రావాలని లేదు. అందుకే, అన్ని సబ్జెక్టుల్లోనూ  ముఫై ఐదు పాస్ మార్కులు అనీ, హిందీకి పదిహేను  చాలనీ అన్నారు.  వీడికి ఆ పదిహేనూ తెచ్చుకోవటం కష్టం కాబట్టి నా చేతిలో ఉన్న పాతికకూ, పోనీలే అని పద్నాలుగు వేసాను. ఆ మిగిలిన ఒక్క మార్కూ తెచ్చుకోలేక ఫెయిల్ ఐతే ఎలాగర్రా?  మళ్ళీ స్కూల్లో చేర్చుకోండీ అని వచ్చాడు.  నువ్వు రికమెండ్ చేస్తావా అంటారు పంతులుగారు.  ఏం చెయ్యాలో మీరే చెప్పండ్రా?"

నిజానికి హిందీలో పాస్ మార్కులు చాలా సులువుగా వచ్చేవి. 'నే' ఎ క్కడ వాడాలీ, 'కి ' ఎక్కడ వాడాలీ లాంటి కొన్ని గ్రామరు సూత్రాలు వస్తే సులువుగా పదిహేను మార్కుల సెక్షన్ లో పదికి పైనే వచ్చేవి. ఉత్తరం రాయటం‌ ప్రహసనంలో చూస్తే, ఉత్తరంలో విషయం ఏమీ అవసరం లేదు - సరైన ఫార్మాట్‌లో రాసి పారేయటమే. లెటర్ బాడీగా ఆ ప్రశ్నపత్రం లోంచి ఒక లైను ఎక్కించినా చాలు.  పదిహేనుకూ పది మార్కులు గ్యారంటీ.  ఇలాంటి సుళువులు బోలెడు ఉండేవి.  స్కూలు వారు ఎంత చెడ్డా పదో పరకో వేసే పంపేవారు.  చివరికి చచ్చుపక్షం పాతిక -ముఫై  మార్కులు వచ్చి పడేవి ఒళ్ళో.  కావలసిన పాస్ మార్కులు పదిహేనూ రాక ఎవరూ తప్పవలసిన అగత్యం ఉండేదే కాదు.   ఐనా, ఈ‌ పిల్లవాడు  75మార్కులకు ఒకటీ తెచ్చుకోలేక పోవటం వింతే మరి!  అలాంటి వాడికి పద్నాలుగు ఎలా వేసి పంపావని ఇప్పుడు పంతులుగారు వేంకట్రావుగారిని నిలదీసే పరిస్థితి!

పుప్పాల వేంకట్రావుగారిలా అందరూ  అంత దయగల ఉపాధ్యాయులు కారు.  ఆ రోజుల్లో పంతుళ్ళు ఇళ్ళవద్ద స్టూడెంట్లకి ప్రైవేట్లు చెప్పటం మహా జోరుగా ఉండేది.  చాలా మంది తమతమ ఇళ్ళకు ప్రైవేటుకు వచ్చే వారికి ఒకలాగా మిగతా వారికి మరొకలాగా మార్కులు వేసేవారు!  ఆ మరొకలా అనేది అప్పుడప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉండేది.

ఈ‌ స్వపక్షం విద్యార్థులకి మంచి మార్కుల కోసం కొందరు టీచర్లు పేపర్లు దిద్దే విధానం చాలా తమాషాగా కూడా ఉండేది అనటంలో వీసమంత అతిశయోక్తి కూడా లేదు.  అందుచేత స్కూలు నుండి పిల్లలకు మార్కుల విషయంలో అన్యాయం జరగకుండా చూడటం అంటే ఆవరేజ్ చేయటంలో పొరపాట్లు పట్టుకోవటమే కాదు, ఆ రెండేళ్ళ పేపర్లూ అన్నీ సరిగా దిద్దారా లేదా అన్నదీ క్షుణ్ణంగా చూసేవారు.  ఉదాహరణకు, ట్యూషన్ పిల్లలు తమ మాష్టారు బట్టీ పట్టించిన సాదాసీదా సమాధానం వ్రాసి పదికి పదీ‌ తెచ్చుకుంటే, మిగతా విద్యార్థులకు పదికి మూడూ నాలుగూ‌ పడేవి అంతకంటే మంచిగా సమాధానం వ్రాసినా సరే.  నాకే ఇలాంటి అనుభవాలు కొల్లలుగా అయ్యాయి! మేష్టర్లు తమ ట్యూషన్ పిల్లలకు ప్రశ్నపత్రాలు లీక్ చేయటమూ తరచుగా జరిగేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి.

నాకు తెలిసి ఇంగ్లీషులో ట్యూషన్ చెప్పించుకునే పిల్లలే కాని తెలుగులోనో, హిందీలోనో ఆ  అవసరం పడే పిల్లలెవరూ ఉండేవారే కాదు. లెక్కలూ సైన్సూ సబ్జెక్టులకు ట్యూషన్ అన్నది సర్వసాధారణం. మా నాన్నగారే నాకు అన్నీ చెప్పేవారు అవసరమైతే.  కాబట్టి నేను ట్యూషన్లకు వెళ్ళే పని ఉండేది కాదు.

హిందీలో అలా వేంకట్రావుగారు దానకర్ణుళ్ళా పదులూ పద్నాలుగులూ వేసేస్తుంటే డిఇవోలు పట్టుకుని అభ్యంతరం చెప్పరా అని అనుమానం వస్తుంది కదా?  నాకు అదే అనుమానం వచ్చి నాన్నగారిని అడిగితే పై చదువులకు హిందీ అంత అవసరం కాదుగదా, ఆ హిందీలో పిల్లలు అనవసరంగా ఫెయిల్ కావటమెందుకూ అని ఈ సబ్జెక్టు విషయంలో మాత్రం అంతా -అంటే అన్ని స్కూళ్ళ లోనూ- కొంచెం ఉదారంగా ఉంటారని చెప్పారని గుర్తు. "పది వరకూ ఫరవాలేదు. మరీ ఎక్కువగా వేసేయకండీ" అన్నా  వేంకట్రావుగారు వినేవారేకాదట.

అన్ని రకాల కారణాలూ‌ కలిసి ప్రతి సంవత్సరమూ చాలా మంది విద్యార్థులకి స్కూలు కోటా మార్కుల్లో సమస్యలు వస్తూ ఉండటమూ,  వాటిని నాన్నగారూ మరొకరిద్దరూ‌ మాష్టర్లు కూర్చుని పట్టుకుని సరిచేయవలసి వస్తూ ఉండటమూ అటు పంతులుగారికీ, ఇటు నాన్నగారికీ ఆందోళన కలిగించేది.  ఈ విషయం నాన్నగారే నాతో కొన్ని సార్లు ప్రస్తావించి బాధపడ్డారు.  ఉపాధ్యాయవృత్తి పవిత్రతకు భంగం వాటిల్లుతోందని విచారించే వారు.